ఆ ప్రజాప్రతినిధి బినామీలతో మల్కాజ్‌గిరి ఏసీపీకి సంబంధాలు: ఏసీబీ ఆరా

By Siva KodatiFirst Published Sep 23, 2020, 5:36 PM IST
Highlights

సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రజా ప్రతినిధి బినామీలతో ఏసీపీకి సంబంధాలు ఉన్నాయని గుర్తించారు అధికారులు.

కొండాపూర్‌లోని సర్వే నంబర్ 64లో అసైన్డ్ భూమిని కొన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిని మధుకర్ అనే వ్యక్తి ద్వారా కొనుగోలు చేశానని విచారణలో చెప్పాడు నర్సింహారెడ్డి.

దీంతో జగిత్యాల జిల్లా గంగాధరలోని మధుకర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఘట్‌కేసర్ అమీన్ పేటలో 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేశాడు  నర్సింహారెడ్డి. నిజాం నాటి భూమిని స్థానిక నేతలతో కలిసి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మహేంద్ర హిల్స్ ఇంటితో పాటు రెండు ఇళ్లు, ఓపెన్ ప్లాట్స్‌ను ఏసీబీ గుర్తించింది. ఇప్పటి వరకు రూ.5 కోట్ల ఆస్తులను గుర్తించగా.. బ్యాంక్ లాకర్లును తెరిచి చూడాల్సి వుంది. ఈ కేసులో ప్రజాప్రతినిధుల లింకులు ఇంకా బయటపడలేదని, విచారిస్తున్నట్లు ఏసీబీ తెలిపింది.

కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్‌తో పాటు మొత్తం 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్‌ సీఐగా పని చేశారు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్‌మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏసీపీ రూ. 50 కోట్ల అక్ర‌మాస్తులు సంపాదించిన‌ట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. మాజీ ఐజీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అల్లుడు న‌ర్సింహారెడ్డి కావడం.. అందులోనూ మంచి పోస్టింగ్‌లో ఉంటూ ఆస్తికి మించిన ఆదాయాన్ని సంపాదించాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి.
 

click me!