హైదరాబాద్ లో 9 ఏళ్ల బాలిక కిడ్నాప్, పది బృందాలు గాలింపు

By telugu teamFirst Published Apr 6, 2021, 7:44 AM IST
Highlights

హైదరాబాదులోని హయత్ నగర్ లో 9 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. ఆమెను సోమవారం మధ్యాహ్నం  రాజు అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని హయత్ నగర్ లో 9 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి బాలిక కనిపించకపోవడంతో తండ్రి ముస్తాఫా హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హయత్ నగర్ లోని తట్టిఅన్నారం ఆర్కె పురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

తమకు ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ముస్కాన్ అనే 9 ఏళ్ల బాలికను ఓ షాపు నుంచి ఓ వ్యక్తి తీసుకుని వెళ్తున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా నిందితుడుని రాజుగా గుర్తించారు. 

బాలిక కోసం 30 మందితో కూడిన పది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు సోమవారం సాయంత్రం హయత్ నగర్ లోని జాతీయ రహదారిపై గల సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే, అతని ఆచూకీ కనిపించలేదు. దీంతో అతను నగరం దాటి వెళ్లి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు రాజు భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలిక అపహరణకు గల కారణాలు తెలియడం లేదు. రాజు పట్టుబడితే తప్ప కారణం తెలియదని పోలీసులు అంటున్నారు. అతని వద్ద ఏదైనా సెల్ ఫోన్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మొబైల్ ఉంటే సెల్ ఫోన్ టవర్ ఆధారంగా అతని జాడను కనిపెట్టవచ్చునని భావిస్తున్నారు. 

click me!