జవహర్ నగర్ ఘటన: పది మంది అరెస్ట్, మొత్తం బీహార్ బ్యాచ్చే

By Siva KodatiFirst Published Dec 27, 2020, 8:50 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జవహర్ నగర్ భూ వివాదం కేసులో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కట్టడాలు కూల్చివేసేందుకు యత్నించిన అధికారులు దాడులు చేశారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జవహర్ నగర్ భూ వివాదం కేసులో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కట్టడాలు కూల్చివేసేందుకు యత్నించిన అధికారులు దాడులు చేశారు. వారం క్రితం జవహర్ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌పై పెట్రోల్ పోసి చంపేందుకు యత్నించారు.

ఈ ఘటనలో పది మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. వీరిలో పొన్నం చాంద్‌తో పాటు తొమ్మిది మంది వున్నారు. అధికారులను అడ్డగించేందుకు బీహార్ నుంచి గ్యాంగ్‌లను దించారు. అధికారులపై దాడులు చేసింది బీహార్ గ్యాంగ్‌లేనని పోలీసులు నిర్థారించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 

గత గురువారం మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్‌ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల కూల్చివేతల్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు వెళ్లిన కమిషనర్‌ మంగమ్మ, కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్, జవహర్‌నగర్‌ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. 

పెట్రోల్, కారం పొడితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి చేతులకు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి. అలాగే కార్పొరేషన్‌ సిబ్బంది, జవహర్‌నగర్‌ కు చెందిన ఓ విలేకరి సురేందర్‌కు గాయాలయ్యాయి. 

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రాత్రికి రాత్రే గదులు నిర్మించడంతో ఎమ్మార్వో గౌతమ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం నేలమట్టం చేసింది. 

అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్‌ కేంద్రంగా మున్సిపల్‌ అధికారులు వాడుతున్నారు. అయినా కూడా జవహర్‌నగర్‌ వాసి పూనమ్‌ చంద్‌ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్‌ చేశారు.

అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్‌గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్‌ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్‌ అధికారులను పూనమ్‌ చంద్‌ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు.

మళ్లీ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్‌ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. 

ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలు చుట్టి వాటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి బయటకు విసిరారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న స్థానిక రాజకీయ పార్టీ నేతలు పూనమ్‌ చంద్‌ కుటుంబసభ్యులకు మద్దతు పలికారు. 

‘వారు చస్తారు. లేదంటే చంపుతారు’ అంటూ రెచ్చొగొట్టేలా నినాదాలు చేశారు. అప్పటికే సాయంత్రం 6.30 గంటలైంది. సీఐ భిక్షపతి నేతృత్వంలోని పోలీసులు అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు.

అయితే గది లోపల కాగడాల మంటలు ఉండటంతో పూనమ్‌ చంద్‌ కుటుంబసభ్యులకు ఏమైనా అవుతుందని సీఐ తలుపులను కాళ్లతో తన్నారు. వెంటనే ఆ గదిలో ఉన్న శాంతి కుమారి నేరుగా పెట్రోల్‌ చల్లడంతో సీఐ భిక్షపతిపై పడింది. 

గదిలో నుంచి పొగలు వస్తున్నాయని సీఐ భిక్షపతి తలుపు తెరిచేందుకు యత్నించాడు. తలుపు తెరుచుకున్న వెంటనే లోపలి నుంచి మంటలు వచ్చాయి. ఎవరైనా అతడి మీద దాడి చేశారా.. అనేది పోలీసు విచారణలో తేలుతుంది.

ఈ ఘటనలో కుట్ర కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. గదిలో ఉన్న శాంతికుమారి, పూనమ్‌చంద్‌లకు ఏమీ జరగలేదు. కేసు విచారణ కోసం వారిని అదుపులోకి తీసుకున్నాం. సీఐ భిక్షపతికి చేతులు, కాళ్లు 14 నుంచి 15 శాతం వరకు కాలాయని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

click me!