డిజిటల్ చెల్లింపులపై కమిటీ చీఫ్గా నీలేకని

By sivanagaprasad kodatiFirst Published Jan 9, 2019, 9:28 AM IST
Highlights

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను విస్తృత పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించేందుకు ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు, ఆధార్ రూపశిల్పి నందన్ నిలేకని సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. 90 రోజుల్లో ఈ కమిటీ డిజిటల్ చెల్లింపుల పెరుగుదలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఆర్బీఐకి సిఫారసు చేయనున్నది.

డిజిటల్ చెల్లింపులను విస్తృతం చేసే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా  డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులకు మరింత భద్రతను కల్పించే అంశంపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆధార్ రూపకర్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనిని ఈ కమిటీని అధ్యక్షుడిగా నియమించింది.

ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, లోపాలను గుర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. 90 రోజుల్లో తమకు నివేదిక సమర్పిస్తుందని ఆర్బీఐ పేర్కొన్నది. డిజిటల్ చెల్లింపుల్లో లోపాలను సరిచేసేందుకు తగిన సలహాలు, సూచనలు కూడా ఇస్తుందని పేర్కొంది.

డిజిటల్ చెల్లింపులపై వినియోగదారుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తీసుకునే చర్యలపై కూడా సలహాలిస్తుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ కమిటీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను విస్తృత పరిచేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిఫారసు చేయనున్నది. 

నందన్ నీలేకనితో పాటు ఆర్బీఐ మాజీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్, విజయా బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో కిశోర్ సాన్సీ, కేంద్ర ఐటీశాఖ మాజీ కార్యదర్శి అరుణ శర్మ, ఐఐఎం అహ్మదాబాద్లో చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్న సంజయ్ జైన్ సభ్యులుగా ఉన్నారు. ‘ఆర్‌బీఐతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్, భారతీయుల కోసం చెల్లింపుల వ్యవస్థ పునరుత్తేజానికి ఆర్‌బీఐ, కమిటీలు కృషి చేస్తాయి’ అని నీలేకని ట్వీట్‌ చేశారు. 

click me!