జియోమీతో శ్యామ్ సంగ్ సై?: వచ్చేనెలలో ‘గెలాక్సీ ఎం’ఆవిష్కరణ

By sivanagaprasad kodatiFirst Published Jan 7, 2019, 8:58 AM IST
Highlights

విప్లవాత్మక మార్పులతో స్మార్ట్ ఫోన్ల రంగంలో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్న చైనా దిగ్గజం జియోమీని ఢీకొట్టేందుకు శామ్ సంగ్ సంసిద్ధమవుతోంది. అందుకోసం మిలీనియల్స్ పేరిట శామ్ సంగ్ గేలాక్సీ ‘ఎం’ పేరిట ఈ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. 

ఒకప్పుడు భారతీయ మొబైల్‌ మార్కెట్‌పై తనదైన ముద్ర వేసిన దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌ తాజాగా మరో అడుగు ముందుకేయబోతున్నది. ఇప్పటివరకు చైనా మొబైల్‌ కంపెనీల రంగ ప్రవేశంతో మొబైల్‌ పరిశ్రమలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్లు కల ఫోన్లు కుప్పతెప్పలుగా వచ్చి పడ్డాయి. 

చైనా సంస్థల నుంచి.. ప్రత్యేకించి జియోమీ నుంచి శాంసంగ్‌ ఒకడుగు వెనకబడిందనే చెప్పాలి. జియోమీ నుంచి గట్టి పోటీనెదుర్కొన్న శాంసంగ్‌ కొత్త సిరీస్‌లో సరికొత్తగా ఫీచర్లతో మొబైళ్లను తేవాలని శాంసంగ్‌ ప్రణాళికలు రచిస్తోంది. మధ్య స్థాయి ధరల శ్రేణిలో ‘శాంసంగ్‌ గెలాక్సీ ఎం’ (ఎం అంటే మిలినియల్స్‌) సిరీస్‌లో ఫోన్లు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలో రెండు ఫోన్లను ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. వాటిల్లో ఒకటి ‘ఎం10’ను రూ.10వేల కన్నా తక్కువగా, ఎం20ని సుమారు రూ.15వేల ధరకు తెచ్చే అవకాశం ఉందని పరిశ్రమ‌ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఫోన్లకు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లేవీ బయటకు రాలేదు. ఇవి ఇన్ఫినిటీ డిస్‌ప్లేతో వస్తాయని సమాచారం. ఇక ఎం30 సిరీస్‌లో ట్రిపుల్‌ కెమెరాతో మరో ఫోన్‌ కూడా రావొచ్చని చెబుతున్నారు. నొయిడాలో ఈ ‘ఎం’ సిరీస్‌ ఫోన్లు తయారవుతున్నట్లు సమాచారం. భారత్‌లోనే ఈ ఫోన్లను మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. 

‘డిస్‌ప్లే, కెమెరా, మెమొరీ, కనెక్టవిటీ టెక్నాలజీల విషయంలో శాంసంగ్‌ ఫోన్లు చాలా అధునాతనంగా ఉంటాయి. సరికొత్త టెక్నాలజీని అది అందిపుచ్చుకుంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ‘ఎం’ జియోమీకి మించి ఉంటుంది’ అని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ నీల్‌ షా పేర్కొన్నారు.

గెలాక్సీ ఎం20 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుందని తెలుస్తోంది. మరి ఎలాంటి ఫీచర్లతో ఈ ఫోన్లు వస్తాయో చూడాలి. సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్0, ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ) హెడ్ ప్రభురామ్ మాట్లాడుతూ శామ్‌సంగ్ న్యూ గ్యాలక్సీ ‘ఎం’ సిరీస్ స్మార్ల్ ఫోన్లు మొబైల్ పరిశ్రమలో మొదటిసారి ఆవిష్క్రుతమవుతున్నాయని, ఇది భారత మార్కెట్ ఎదుగుదలకు ప్రాముఖ్యతనిస్తోందన్నారు.

మిలీనియల్ సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ ద్వారా భారతదేశంలోని తన మార్కెట్‌ను సంఘటితం చేసుకోవాలని శామ్ సంగ్ భావిస్తోంది. అందుకు చౌక, మిడ్ ప్రైస్ సెగ్మెంట్‌లో అడుగు పెట్టాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 
 

click me!