ముంబై: జియో గిగా ఫైబర్ సేవలను టెలికం దిగ్గజం రిలయన్స్ జియో వాణిజ్యపరంగా అందుబాటులోకి తేనున్నది. సుదీర్ఘ కాలంగా ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ఈ నెల 12వ తేదీన జరగబోయే 42వ ఏజీఎంలో వాణిజ్యంగా విపణిలోకి ప్రవేశపెట్టనున్నది. ఈ సందర్భంగా జియో తన కస్టమర్లకు మరో శుభవార్త అందించనున్నది.
జియో గిగా ఫైబర్ సేవలతోపాటు జియోఫోన్-2కి కొనసాగింపుగా అప్గ్రేడ్ వెర్షన్తో జియో ఫీచర్ ఫోన్-3ని తీసుకురానున్నది. జియోఫోన్-2 కంటే ఆకర్షణీయ ఫీచర్లతో, దాదాపు అన్ని అంశాలలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది.
జియో ఫోన్3 ఫీచర్ల పై అధికారిక సమాచారం వెల్లడి కాకున్నా మైస్మార్ట్ప్రైస్ నివేదిక ప్రకారం 4జీ టెక్నాలజీతో జియోఫోన్-3 మీడియా టెక్ చిప్సెట్తో రానుంది. 5 అంగుళాల టచ్ స్క్రీన్తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్ సాయంతో చాలా స్మార్ట్గా జియో ఫోన్-3ని ఆవిష్కరించనుంది.
2 జీబీ ర్యామ్, 64 ర్యామ్ స్టోరేజ్ సామర్ధ్యంతో జియో ఫీచర్ ఫోన్-3 స్మార్ట్ఫోన్ను రానున్నదని తెలిసింది. ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరిచినట్టు తెలుస్తోంది.
రిలయన్స్ జియో తన తొలి ఫీచర్ ఫోన్ను 2017లో ఆవిష్కరించింది. మలి విడత జియో ఫీచర్ ఫోన్-2ను గతేడాది ఆగస్టు ఏజీఎం సందర్భంగా విపణిలోకి ప్రవేశపెట్టింది. మీడియా టెక్ సంస్థ రిలయన్స్ జియో సంస్థతో కలిసి పని చేస్తుండగా, భారత్లో ఐఓఎస్ సేవల కోసం కా ఓఈఎంతో పని చేస్తోంది.