2020 విజన్: ఫేస్‌బుక్‌లో ‘న్యూస్’ ఫీచర్

By rajesh yFirst Published Aug 12, 2019, 10:58 AM IST
Highlights

వచ్చే ఏడాది ఫేస్ బుక్ తన వినియోగదారులకు వార్తలు అందించనున్నది. ఇందుకోసం స్పెషల్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నది.

న్యూఢిల్లీ: వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లను ప్రవేశపెడుతున్న సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్‌.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. సోషల్ మీడియా వాడకం విరివిగా పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్‌బుక్‌లోనే వార్తల్ని అందంచే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. 

దీనికోసం ఫేస్‌బుక్‌లోని ప్రధాన ఫీచర్లు న్యూస్‌ఫీడ్‌, మెస్సెంజర్‌, వాచ్‌తో పాటు న్యూస్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ని జతచేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థల్ని సంప్రదించినట్లు సీఎన్‌బీసీ పేర్కొంది. లైసెన్స్‌ కోసం ఆయా సంస్థలకు 30 లక్షల డాలర్లు చెల్లించడానికి కూడా సిద్ధమైనట్లు సమాచారం. 

కొత్తగా రాబోతున్న ‘న్యూస్‌’ ఫీచర్‌ గురించి జుకర్‌బర్గ్ గత ఏప్రిల్‌లో ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. అంతా సజావుగా సాగితే.. వచ్చే సంవత్సరం తొలుత ఈ ఫీచర్‌ని అమెరికా వినియోగదారులకు అందించనున్నట్లు సమాచారం. 

మెరుగైన, విశ్వసనీయ సమాచారాన్ని యూజర్లకు అందించాలనే లక్ష్యంతోనే ఈ కొత్త ఫీచర్‌ని తీసుకొస్తున్నామని జుకర్‌బర్గ్‌ అప్పట్లో తెలిపారు. సమాచారం కోసం ఆయా వార్తాసంస్థలకు ఫేస్‌బుక్‌ భారీగా డబ్బులు చెల్లిస్తున్నా.. వినియోగదారులకు మాత్రం ఉచితంగానే అందించనున్నట్లు తెలుస్తోంది.

click me!