గిగా ‘ఫైబర్’ అరంగ్రేటం నేడే.. రిలయన్స్ ఏజీఎం భేటీపైనే అంతా ఫోకస్!

By rajesh yFirst Published Aug 12, 2019, 10:43 AM IST
Highlights

మార్కెట్ వర్గాలు, ఇన్వెస్టర్లు, వినియోగదారులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) వచ్చేసింది. సోమవారం జరిగే రిలయన్స్ ఏజీఎం భేటీ మరో కొత్త రంగంలో అడుగు పెట్టనున్నట్లు ప్రకటించనున్నది. దీని రిలయన్స్ జియో గిగా ఫైబర్ తోపాటు రిలయన్స్ ఈ-కామర్స్, జియో ఫోన్ 3పై స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముంబై: టెలికం రంగంలో సంచలనాల రిలయన్స్ జియో.. మరో సెన్సేషన్‌కు సిద్ధమైంది. జియో 4జీ.. తర్వాత మరో సంచలనానికి తెర తీయనుంది రిలయన్స్. అదే 'జియో గిగా ఫైబర్'​. డీటీహెచ్, టీవీ, ల్యాండ్​ లైన్ మూడు సేవలను ఒకే దగ్గర పొందే వీలుండటమే దీని ప్రత్యేకత. 

జియో 4జీ తర్వాత.. ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన 'గిగా ఫైబర్' సేవలపై సోమవారం స్పష్టత రానుంది. ఈనాడు జరిగే రిలయన్స్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) భేటీలో దీనిపై ప్రకటన వెలువడనున్నదని భావిస్తున్నారు. ఈ సమావేశంలో రిలయన్స్ 'గిగా ఫైబర్' సేవల ప్రారంభంపై స్పష్టత ఇవ్వనుంది. 

జియో కొత్త ఫోన్, జియో ఈ కామర్స్ వ్యాపారంపైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత ఏడాది రిలయన్స్ సర్వ సభ్య సమావేశంలో 'గిగా ఫైబర్​'ను తేనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 1,100 పట్టణాల్లో 'గిగాఫైబర్' ట్రయల్స్ నిర్వహిస్తోంది రిలయన్స్. 

తొలుత సంస్థ ఉద్యోగులపై ట్రయల్ నిర్వహించినా.. తర్వాత బీటా టెస్టింగ్ యూజర్లకు సేవలు విస్తరించింది. సంస్థ ఉద్యోగులు, బీటా యూజర్లపై నిర్వహిస్తోన్న 'గిగా ఫైబర్' సేవలు చివరి దశకు చేరుకున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇటీవలే తెలిపారు. 

దీంతో 'గిగా ఫైబర్' సేవలు ప్రారంభించేందుకు రిలయన్స్ జియో సిద్ధమైందన్న సంకేతాలకు ఈ ప్రకటన ఊతమందించింది. జియో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, టీవీతో పాటు ఉచిత ల్యాండ్‌లైన్‌, డీటీహెచ్​ సేవలు అందించడం దీని ప్రత్యేకత. ల్యాండ్​లైన్ సేవల వల్ల ప్రస్తుతం సిగ్నల్ సమస్య ఉన్న ప్రాంతాలకూ కాలింగ్ సమస్య తీరనుంది. గ్రామాలకూ ఇంటర్నెట్ సేవలు సులభం కానున్నాయి. 

ఇప్పటి వరకు ఇంటర్నెట్, ల్యాండ్​లైన్​ సేవలు ఒకే కనెక్షన్​పై అందుబాటులో ఉన్నా.. టీవీ కోసం మరో కనెక్షన్​ తీసుకోక తప్పడం లేదు. జియో గిగా ఫైబర్ అందుబాటులోకి వస్తే ఒకే కనెక్షన్​తో మూడు సేవలు లభ్యం కానున్నాయి. 'గిగా ఫైబర్' అందుబాటులోకి వస్తే.. ఈ సేవలపై ప్రస్తుతం ఉన్న చార్జీల మోత తగ్గనుంది.

జియో 4జీ రాకతో డేటా చార్జీలు దిగొచ్చినట్లే.. ఇతర సంస్థలూ తమ టారీఫ్​లను మార్చుకోవాల్సి వస్తోంది. ట్రయల్ దశలో పలు పట్టణాల్లో రూ.4,500 రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్​తో 'గిగాఫైబర్' కనెక్షన్ ఇస్తోంది రిలయన్స్. 'ట్రిపుల్ ప్లే' ప్లాన్​తో వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

'ట్రిపుల్ ప్లే' ప్లాన్​లోని వినియోగదారులు డీటీహెచ్, బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్ సేవలను పొందుతున్నారు. రూ.2,500తో మరో ప్లాన్​ను తెచ్చింది జియో. ఈ ప్లాన్​లో 50 ఎంబీపీఎస్ స్పీడ్​తో జియో గిగా ఫైబర్ సేవలను అందిస్తోంది.

ట్రిపుల్ ప్లే ప్లాన్​కు నెలవారీ చందా రూ.600 ఉండనున్నట్లు తెలుస్తోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం రూ.1,000 నెలవారీ చందాతో రిలయన్స్ మరో ప్లాన్​ను​ కూడా తీసుకురానుంది. ఒక వేళ సేవలు వద్దనుకుంటే.. సెక్యూరిటీ డిపాజిట్​ను తిరిగి పొందేందుకు వీలుండనుంది.

click me!