అమెరికాలో ఇళ్లకే ప్రజలు పరిమితం ఆపిల్ స్టోర్ల నిరవధిక మూత

By narsimha lodeFirst Published Mar 19, 2020, 3:50 PM IST
Highlights

అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ (కొవిడ్‌-18) వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో.. చైనాలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ రిటైల్‌ దుకాణాలను నిరవధికంగా మూసివేస్తున్నట్టు టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ప్రకటించింది

న్యూయార్క్‌: అంతర్జాతీయంగా కరోనా వైరస్‌ (కొవిడ్‌-18) వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో.. చైనాలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ రిటైల్‌ దుకాణాలను నిరవధికంగా మూసివేస్తున్నట్టు టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ప్రకటించింది. తొలుత ఈ నెల 27వ తేదీ వరకే తమ రిటైల్‌ స్టోర్లను మూసివేయనున్నామని ఆపిల్ ప్రకటించింది. 

కానీ తాజాగా ఆ సంస్థ.. తాము తిరిగి ప్రకటించేంత వరకూ స్టోర్ల మూసివేత కొనసాగుతుందని స్పష్టం చేసింది.లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ ఆపిల్‌ ఉద్యోగికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

‘‘మా ‘కల్వర్‌ సిటీ’ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు సెల్ఫ్‌-ఐసోలేషన్‌ వార్డులో ఉన్నాడు. ప్రపంచానికిది పరీక్షా సమయం.  ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 సోకిన ప్రతి ఒక్కరికీ, వీరోచితంగా పోరాడుతున్న వైద్య సిబ్బందికి, పరిశోధకులకు మా సహాయ సహకారాలు ఉంటాయి.’’ అని ఆపిల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

కరోనాపై పోరాటానికి తమ వంతు సాయంగా ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ 15 మిలియన్‌ డాలర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
కరోనా నేపథ్యంలో ఆపిల్‌ తమ ఉద్యోగులకు అనుకూలమైన పనిగంటలను అనుమతిస్తోంది. 

అంతేకాకుండా వారు ఇంటి నుంచే పని చేసే వీలును కూడా ఆపిల్ కల్పిస్తోంది. తమ కార్యాలయాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని టిమ్‌ కుక్‌ తెలిపారు. ఉద్యోగుల శరీర ఉష్ణోగ్రత, ఇతర ఆరోగ్య అంశాల పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశామని వివరించారు.

గతవారం అమెరికాలోని రిటైల్ స్టోర్లన్నీ ఆపిల్ తాత్కాలికంగా మూసివేసింది. తాజాగా ఇటలీ, స్పెయిన్ దేశాల్లోని స్టోర్లను కూడా మూసివేసినట్లు ప్రకటించింది. చైనా తర్వాత ఇటలీలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో ఆపిల్ నడుపుతున్న 42 స్టోర్లను రీ ఓపెన్ చేసింది ఆపిల్..

కరోనా వైరస్‌ను విజయవంతంగా కట్టడి చేసినందుకు చైనాకు ఆపిల్ ధన్యవాదాలు తెలిపింది. తాజాగా చైనా మినహా అన్ని దేశాల్లో ఆపిల్ స్టోర్ల మూసివేతకు కారణాలు సంస్థ యాజమాన్యం వెల్లడించలేదు. న్యూయార్క్ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలతోపాటు పలు అమెరికా నగరాల ప్రజలు ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని, బార్లు రెస్టారెంట్లకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. 
 

click me!