రిలయన్స్ జియోకు కొత్త కష్టాలు:పెండింగ్‌లో ఫేస్‌బుక్ డీల్‌?!

By Sandra Ashok KumarFirst Published Jun 18, 2020, 10:29 AM IST
Highlights

టెలికం సంచలనం ‘రిలయన్స్ జియో’కు ఫేస్ బుక్‌తో ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కన్ను పడింది. దీనివల్ల డేటా దుర్వినియోగం అవుతుందేమోనని సందేహించింది.  
 

న్యూఢిల్లీ: రుణ రహిత సంస్థగా మారేందుకు జియో ద్వారా పెట్టుబడులను స్వీకరిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కష్టాలొచ్చి పడ్డాయి. జియో ఫ్లాట్ ఫామ్స్‌లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పెట్టుబడులకు కుదుర్చుకున్న ఒప్పందంపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కన్ను పడింది.

ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా ఇంటర్నెట్ విస్తరిస్తున్న భారతదేశానికి చెందిన డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆరోపణలపై సీసీఐ ద్రుష్టిని కేంద్రీకరించింది. దీనిపై పూర్తి వివరాలను వెల్లడించడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా నిరాకరించారు. అయితే, జియో-ఫేస్ బుక్ ఒప్పందాన్ని పెండింగ్‌లో ఉంచుతున్నట్లు కుండబద్దలు కొట్టారు. 


ఇదిలా ఉంటే రిలయన్స్‌ జియో మార్కెట్‌ వాటా 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 48 శాతానికి చేరుకోవచ్చని బెర్న్‌స్టీన్‌ అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి కంపెనీకి 38.8 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 2022-23లో యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటనుందని, 2024-25 నాటికి 56.9 కోట్లకు, 2027-28 నాటికి 60.9 కోట్లకు చేరుకోవచ్చని అంటోంది. 

also read  యు.ఎస్. చరిత్రలో అతిపెద్ద సైబర్-దాడి.. అసలేం జరిగింది..?  

గత ఏడాది మార్కెట్‌ వాటా 36 శాతం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 శాతానికి పెరగవచ్చని, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 48 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. సేవల ద్వారా లభించే ఆదాయం వచ్చే మూడేళ్లలో రెట్టింపు అవుతుందని బెర్న్‌స్టీన్‌ అంచనా. 2024-25 నాటికి ఆదాయం పరంగా కంపెనీ మార్కెట్‌ వాటా 44 శాతానికి చేరుకోవచ్చని అంచనా. 


మరోవైపు దేశీయంగా 5జీ ట్రయల్స్‌ నిర్వహించేందుకు రిలయన్స్‌ జియో కసరత్తు చేస్తున్నది. టెలికం శాఖ (డీవోటీ) అనుమతి కోసం ఆ సంస్థ ఎదురు చూస్తున్నది. 5జీ ట్రయల్స్‌ కోసం జియో చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకొంటామని డీవోటీ వర్గాలు వెల్లడించాయి.

ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి పరిమితమయ్యే ల్యాబ్‌ ట్రయల్స్‌కు 5జీ తరంగాలు అవసరంలేదని, అయినప్పటికీ ఈ ట్రయల్స్‌ కోసం డీవోటీ అనుమతి కోరామని జియో తెలిపింది. 5జీ ట్రయల్స్‌ కోసం జియోతోపాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కూడా టెలికం శాఖను సంప్రదించినా, ఇంకా ఏ సంస్థకూ అనుమతి ఇవ్వలేదు.

టెలికం సంస్థలతోపాటు నోకియా, జెడ్‌టీఈ, శాంసంగ్‌, ఎరిక్‌సన్‌, హువావీ లాంటి నెట్‌వర్క్‌ పరికరాల తయారీ సంస్థలు కూడా దేశంలో 5జీ ట్రయల్స్‌ కోసం దరఖాస్తు చేసుకొన్నాయి.
 

click me!