అమెజాన్‌ పేలో సరికొత్త ఫీచర్.. ఇక పేమెంట్లు మరింత సులభంగా!

By Sandra Ashok KumarFirst Published Jun 27, 2020, 11:32 AM IST
Highlights

ప్రముఖ ఈ-కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్​ మరో అడుగు ముందుకేసింది. ఈ సంస్థ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో 'స్మార్ట్‌ స్టోర్స్‌' వసతిని ప్రారంభించింది. స్థానిక దుకాణాలలో సౌకర్యంగా, సురక్షితంగా కొనుగోళ్లలకు ఈ స్మార్ట్​ స్టోర్స్​ ఉపయోగపడతాయని అమెజాన్ పే సంస్థ సీఈఓ మహేంద్ర నెరూర్కర్​ తెలిపారు.
 

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ వ్యాపార దిగ్గజం ‘అమెజాన్‌’ అనుబంధ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో 'స్మార్ట్‌ స్టోర్స్‌' వసతిని ప్రారంభించింది. దీని ద్వారా ఆఫ్‌లైన్‌ దుకాణాల్లోనూ కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులు చేయవచ్చని వివరించింది.

"దేశ వ్యాప్తంగా ఉన్న లక్షల స్థానిక దుకాణాలు ఇప్పటికే అమెజాన్‌ పే పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ దుకాణాల్లో వినియోగదారులకు మరింత ఉత్తమమైన అనుభూతినిచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. మా 'స్మార్ట్‌ స్టోర్స్‌' ద్వారా ఈ దుకాణాలు మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతాయి’ అని అమెజాన్ పే సీఈఓ మహేంద్ర నెరూర్కర్ పేర్కొన్నారు.

అమెజాన్‌ యాప్‌లో స్మార్ట్‌ స్టోర్స్ దుకాణాల క్యూఆర్‌ కోడ్లను స్కాన్‌ చేయటం ద్వారా వినియోగదారులు.. అక్కడ లభించే వివిధ వస్తువులను గురించి తెలుసుకునే వీలు కలుగుతుంది. తమకు కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకున్న అనంతరం.. వారు అమెజాన్‌ పే ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. 

అంతేకాకుండా వారు చెల్లింపులను అక్కడికక్కడే ఈఎంఐలుగా మార్చుకునే అవకాశం కూడా దీనిలో లభిస్తుంది. ఆయా వస్తువులపై వచ్చిన సమీక్షలను  చదువగలుగుతారని.. దుకాణదారు సహాయం లేకుండానే వాటిపై లభ్యమయ్యే ఆఫర్లను కూడా తెలుసుకోవచ్చని మహేంద్ర నెరూర్కర్ వివరించారు.

also read వాట్సాప్ పేమెంట్స్‌పై బ్యాన్..మనదేశానికి ఎంతవరకు సేఫ్?! ...

స్మార్ట్‌ స్టోర్స్ విధానంలో లభించే ఈఎంఐలు, బ్యాంకు ఆఫర్లు, రివార్డుల ద్వారా కొనుగోళ్లు మరింత సులువుగా, లాభదాయకంగా మారుతాయి. అదేవిధంగా స్థానిక దుకాణాలు మరింత మంది వినియోగదారులను ఆకర్షించగలుగుతాయి. 

అమెజాన్ పే స్మార్ట్ స్టోర్స్‌తోపాటు వినియోగదారులకు మంచి షాపింగ్‌ అనుభవం లభించటంతోపాటు అమ్మకాలు పెరగడంతో వినియోగదారులు,  ఇద్దరికీ ప్రయోజనకరమని సంస్థ సీఈఓ మహేంద్ర నెరూర్కర్‌ తెలిపారు. 'స్మార్ట్‌ స్టోర్స్' ద్వారా పల్లెలు, చిన్న పట్టణాల్లో ఉండే సాధారణ దుకాణాలు కూడా డిజిటల్‌ విక్రయశాలలుగా మారనున్నాయి. 

కాగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న బిగ్‌ బజార్‌, మెడ్‌ప్లస్‌, మోర్‌ సూపర్‌ మార్కెట్లతో పాటు విశాఖపట్నం, జబల్‌పూర్‌ వంటి పట్టణాలు, వేల గ్రామీణ ప్రాంత దుకాణాలు కూడా అమెజాన్‌ పే స్మార్ట్‌ స్టోర్లుగా రూపాంతరం చెందాయని సీఈఓ మహేంద్ర నెరూర్కర్ అన్నారు.

click me!