విశాఖలో జగన్ పై దాడి.. ఇబ్బందిపడ్డ కోహ్లీ సేన

By ramya neerukondaFirst Published Oct 27, 2018, 11:06 AM IST
Highlights

జగన్ పై జరిగిన దాడి కారణంగా.. టీం ఇండియా జట్టు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటలపాటు కోహ్లీ సేన ఎయిర్ పోర్టు బయట నిరీక్షించాల్సి రావడం గమనార్హం.

విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడి కారణంగా.. టీం ఇండియా జట్టు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటలపాటు కోహ్లీ సేన ఎయిర్ పోర్టు బయట నిరీక్షించాల్సి రావడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... గురువారం ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లోని వెయిటర్‌గా పనిచేస్తోన్న శ్రీనివాసరావు అనే యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి అని వెళ్లి జగన్‌పై కోడిపందేల కత్తెతో దాడి చేశాడు. ఈ దాడితో విమానాశ్రయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ ఘటన ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జగన్‌కు ప్రాథమిక చికిత్స అందించి విమానంలో హైదరాబాద్‌కు పంపేశారు. 

అయితే, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొనే సమయంలో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థతి నెలకొనడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్టులోకి బయటి వ్యక్తులను ఆ సమయంలో అనుమతించలేదు. ఇదే సమయంలో భారత క్రికెట్ జట్టు రెండు బస్సుల్లో విమానాశ్రయం వద్దకు చేరుకుంది. విమానశ్రయం లోపల ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భద్రతా సిబ్బంది ఎవరినీ లోపలికి పంపలేదు. అలాగే వాహనాలను విమాశ్రయానికి కాస్త దూరంగా ఆపేశారు. ఈ వాహనాల మధ్యలో టీమిండియా బస్సులు కూడా ఉన్నాయి. దీంతో కోహ్లీ సేనకు కాసేపు నిరీక్షణ తప్పలేదు. 

బుధవారం వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడిన భారత్.. ఆ మ్యాచ్‌ను టై చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో వన్డే ఆడేందుకు భారత జట్టు పుణే వెళ్లాల్సి ఉంది. ఈనెల 27న వెస్టిండీస్, భారత్ మధ్య మూడో వన్డే జరుగుతుంది. అందుకే గురువారం విశాఖపట్నం నుంచి నేరుగా భారత జట్టు పుణేకు బయలుదేరింది. హోటల్ నుంచి రెండు బస్సుల్లో బయలుదేరిన జట్టు విమానాశ్రయం వద్దకు వచ్చే సరికి లోపల జగన్‌పై దాడి జరిగింది. దీంతో ఈ రెండు బస్సులు కాసేపు బయటే ఆగిపోయాయి. విమాశ్రయంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న తరవాత భారత ఆటగాళ్లను లోపలికి పంపారు. అక్కడి నుంచి విమానంలో టీమిండియా పుణే బయలుదేరి వెళ్లింది. 

click me!