
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేధికగా టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఐసిసి( అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్ పై భారత్, పాకిస్ధాన్ దేశాల క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐసిసి ప్రకటించిన టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత్, పాక్ లను వేరు వేరు గ్రూపుల్లో వేయడమే అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యింది.
ఇప్పటికే వివిధ కారణాలతో ఈ దాయాది దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిని ద్వైపాక్షిక సీరిస్ లు జరగడం లేదు. కేవలం ఐసిసి నిర్వహించే టోర్నీల్లోనే ఇరు దేశాలు తలపడుతున్నాయి. అయితే చాంపియన్ ట్రోపి, వన్డే, టీ20 ప్రపంచ కప్ వంటి టోర్నీలో ఈ రెండు దేశాల మధ్య ఎక్కువ మ్యాచ్ లు జరిగేలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే 2020 లో జరిగనున్న టీ20 వరల్డ్ కప్ విషయంలో ఐసిసి వారి ఆశలపై నీళ్లు చల్లింది. తాజాగా టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే అంతర్జాతీయ జట్లను ఐసిసి రెండు గ్రూపులుగా విభజించింది. లీగ్ దశలో ఏ గ్రూప్ లోని జట్టు అదే గ్రూప్ లోని మరో జట్టుతో మాత్రమే తలపడాల్సి వుంటుంది.
ఇలా గ్రూప్ 1 లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్ జట్లను చేర్చారు. అలాగే గ్రూప్ 2లో ఇండియా, ఇంగ్లాండ్,, సౌత్ ఆఫ్రికా, అప్ఘనిస్థాన్ జట్లను చేర్చారు. దీంతో ఈ టీ20 మెగా సమరం ఆరంభంలో నిర్వహించే లీగ్ మ్యాచుల్లో భారత్-పాక్ మ్యాచ్ లు జరిగే అవకాశం లేదు. ఇదే ఈ రెండు దేశాల అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది.
అయితే దీనిపై ఐసిసి చీఫ్ రిచర్డ్సన్ వివరణ ఇచ్చారు. ఈ గ్రూపులను ఐసీసీ ర్యాంకుల ఆధారంగా నిర్ణయించామని ఆయన తెలిపారు. అందువల్లే ఐసిసి టీ20 ర్యాకింగ్స్ లో మొదటి స్థానంలో వున్న పాకిస్థాన్ మొదటి గ్రూప్ లోకి, రెండో స్థానంలో వున్న భారత్ ను మరో గ్రూప్ లో చేర్చినట్లు వివరించారు. ఐసిసి విశ్వసనీయత కోసమే ఈ పద్దతి పాటించినట్లు...దాన్ని పక్కన పెట్టి ఇరుజట్లను ఒకే గ్రూప్లో ఆడించలేమన్నారు. ఇరు జట్లు సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్లో తలపడే అవకాశం తప్ప మరో మార్గం లేదని రిచర్డ్సన్ స్పష్టం చేశారు.