ఏషియన్ గేమ్స్ 2023 : జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పతకాలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం

By Siva KodatiFirst Published Oct 4, 2023, 8:52 PM IST
Highlights

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధించాడు. మరో జావెలిన్ త్రోయర్ కిశోరో జెనా రజతం కైవసం చేసుకున్నాడు.  భారత్‌కు చెందిన జావెలిన్ త్రో క్రీడాకారులు ఒకేసారి గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కించుకోవడం ఇదే తొలిసారి.

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధించాడు. మరో జావెలిన్ త్రోయర్ కిశోరో జెనా రజతం కైవసం చేసుకున్నాడు. నీరజ్ 88.88 మీటర్ల దూరం ఈటెను విసిరగా.. కిశోర్ కుమార్ 87.54 మీటర్ల దూరం విసిరాడు. జపాన్‌కు చెందిన డీన్ రొడెరిక్ 82.68 మీటర్ల దూరం విసిరి మూడో  స్థానానికి పరిమితం అయ్యాడు.

అయితే భారత్‌కు చెందిన జావెలిన్ త్రో క్రీడాకారులు ఒకేసారి గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కించుకోవడం ఇదే తొలిసారి. అలాగే పురుషుల 4x400 మీటర్ల రిలే ఫైనల్‌లో మహ్మద్ అనస్ యాహియా, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేశ్ రమేశ్‌ల బృందం స్వర్ణ పతాకాన్ని అందుకుంది. అటు మహిళల 4x400 మీటర్ల రిలే ఫైనల్‌లో విద్య రామ్ రాజ్, ఐశ్వర్య మిశ్రా, ప్రాచీ, సుభా వెంకటేశన్‌లు రెండో స్థానంలో నిలిచి రజతం అందుకున్నారు. 

Also Read: ఏషియన్ గేమ్స్ 2023: ఫైనల్‌కి భారత హాకీ పురుషుల జట్టు.. సెమీస్ చేరిన మహిళా కబడ్డీ జట్టు...

మరోవైపు.. ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత హాకీ పురుషుల జట్టు, ఫైనల్‌కి అర్హత సాధించింది. దక్షిణ కొరియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 5-3 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్ చేరింది భారత హాకీ జట్టు. తొలి క్వార్టర్‌లో హర్వీక్ సింగ్, మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపధ్యాయ్ గోల్స్ చేయడంతో భారత్‌ 3-1 తేడాతో మంచి ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్‌లో అమిత్ రోహిదాస్, నాలుగో క్వార్టర్‌లో అభిషేక్ సింగ్ గోల్స్ సాధించారు. సౌత్ కొరియా నుంచి జుంగ్ మంజో ఒక్కడే మూడు గోల్స్ చేసినా విజయాన్ని అందించలేకపోయాడు..

వరుసగా ఆరు విజయాలతో ఏషియన్ గేమ్స్ 2023 ఫైనల్‌కి చేరిన భారత హాకీ జట్టు, ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే గోల్డ్ మెడల్‌తో పాటు పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌కి కూడా నేరుగా అర్హత సాధిస్తుంది. మహిళల కబడ్డీలో భారత్, సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. థాయిలాండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 54-22 తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పుత్రీ వద్రానీతో మ్యాచ్‌లో 21-16, 21-16 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌కి అర్మత సాధించింది.. 
 

click me!