
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన భారత అగ్రశ్రేణి బాక్సింగ్ క్రీడాకారిణీ మేరీకోమ్ (MC Mary Kom ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం (2022 Commonwealth Games ) జరుగుతున్న బాక్సింగ్ ట్రయల్స్ (Women’s Boxing Trials ) నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. నీతూతో (Nitu) జరిగిన 48 కేజీల పోటీల్లో లండన్ ఒలింపిక్ కాంస్య పతక విజేత మేరీకోమ్ మోకాలికి గాయమైంది.
ఆ సమయంలో ఆమె సరిగ్గా ప్రారంభ రౌండ్లోని మొదటి నిమిషం వద్ద వున్నారు. గ్రిటీ పగ్లిస్ట్, వైద్య సంరక్షణ పొందిన తర్వాత బౌట్ను తిరిగి ప్రారంభించేందుకు మేరీ కోమ్ తిరిగి రింగ్లో అడుగుపెట్టారు. అయితే తీవ్రమైన నొప్పి కారణంగా ఇబ్బంది పడింది. దీనిని గమనించిన రిఫరీ బౌట్ను ఆపివేసి.. ఆర్ఎస్సీఐ తీర్పు మేరకు నీతూని విజేతగా ప్రకటించారు. దీంతో బర్మింగ్హామ్లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ను సైతం మేరీకోమ్ వదులుకోవాల్సి వచ్చింది. పలుమార్లు ఆసియా స్వర్ణ పతకాన్ని అందుకున్న మేరీకోమ్ చివరిసారిగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అక్కడ ప్రీ క్వార్టర్స్ వరకు చేరుకున్నప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆసియా క్రీడలతో పాటు కామన్వెల్త్ గేమ్స్పై ఆమె దృష్టి పెట్టారు.
ఇకపోతే.. రెండుసార్లు మాజీ యూత్ వరల్డ్ ఛాంపియన్ అయిన నీతూ.. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మినిమ్ వెయిట్ డివిజన్లో కామన్వెల్త్ ట్రయల్స్లో ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాడ్జా మెమోరియల్ టోర్నమెంట్లో ఈ హర్యానా బాక్సర్ స్వర్ణం సాధించింది. ప్రస్తుతం కామన్వెల్త్ పోటీల్లో స్థానం కోసం మంజు రాణితో పోటీపడనుంది. ప్రపంచ ఛాంపియన్షిప్లో 48 కేజీల విభాగంలో భారత్కు ప్రాతినిథ్యం వహించిన నీతూ ఇప్పుడు ఈ విభాగంలో కామన్వెల్త్లో స్థానాన్ని పొందడం విశేషం.
అయితే.. మేరీకోమ్ తాజా నిర్ణయం ఆమె కెరీర్ను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం వుందని నిపుణులు అంటున్నారు. వచ్చే ఏడాది ఈమెకు 40 ఏళ్లు నిండుతాయి. కానీ 39 ఏళ్ల వయసులోనూ రింగ్లో తన సత్తాను చాటుతూ.. ఫిట్నెస్ విషయంలో ఆమె బెంచ్ మార్క్ సెట్ చేసిందని చెప్పవచ్చు. మరి మేరీకోమ్ మళ్లీ తిరిగి రింగ్లోకి అడుగుపెడతారా లేదా అన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.