తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 11న పుష్పయాగం

Published : Nov 11, 2021, 10:08 AM IST
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 11న పుష్పయాగం

సారాంశం

. తిరుమల గురించి, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని గురించి కొత్తగా చెప్పటానికి ఏముంటుంది. ఆపద మొక్కులవాడు అని, భక్తుల పాలిట కొంగుబంగారమని అంటుంటారు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


            "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన 

              వేంకటేశ  సమో దేవో న భూతో న భవిష్యతి "

 ఈ బ్రహ్మాండం అంతట్లో కూడా వేంకటాద్రిని పోలిన మరొక స్థలం లేదని, అలాగే వెంకటేశ్వర స్వామిని మించిన దైవం ఇంతకు ముందు లేదు, ఇకపై రాడు అని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. తిరుమల గురించి, కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని గురించి కొత్తగా చెప్పటానికి ఏముంటుంది. ఆపద మొక్కులవాడు అని, భక్తుల పాలిట కొంగుబంగారమని అంటుంటారు. నిరుపేదల నుండి అపర కుబేరులవరకు ఆయన ఆపద్భాంధవుడే!!  తొండమాను చక్రవర్తి, కురుంబరతు నంబి చరిత్రలు మనకి తెలిసినవే కదా. తిరుమలకి వెళ్లి శ్రీదేవి , భూదేవి సమేత మంగళ స్వరూపుడైన శ్రీనివాసుడికి  చేసే ఆర్జిత సేవలలో పాల్గుని తరిద్దామని ఉండని భక్తులు ఉండరు.


            "పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి

            తదహం భక్త్యుపహృతమ్‌ అశ్నామి ప్రయతాత్మనః "

            - భగవద్గీత ( 9వ అధ్యాయం: రాజవిద్యా యోగం, 26వ శ్లోకం )

'నిర్మలమైన మనస్సుతో భక్తుడు సమర్పించే పత్రం, పుష్పం, ఫలం, జలం నాకు అత్యంత ప్రీతికరమైనవి'. ఇవి ఉన్నా లేకున్నా ప్రత్యేకించి భగవదారా ధనకు 'పవిత్రమైన మనసు' ప్రధానం. ఆఖరికి 'అన్ని విధాలైన పత్ర పుష్పాలు లభించనప్పుడు మరే అనుకూలమైన, నిషిద్ధం కాని పుష్పాలతోనైనా పూజించ వచ్చు' అని 'తత్వసాగర సంహిత' పేర్కొన్నది. 

* నవంబరు 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 10న  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు.

* పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

* మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ugadi: కొత్త సంవత్సరం రోజున శుభ ఫలితాలు ఇచ్చే 4 మంత్రాలు
Ugadi Festival 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేయకపోతే… ఏడాది మొత్తం ప్రభావం పడుతుందా?