
నిజాంబాద్ ఎంపి కవిత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు బాగా చురకలేశారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యవహారాలు చూసుకోబాబు, మా జోలికి రావద్దని ఒక ఘాటు సలహా ఇస్తూ, ’ మేం మీ ప్రభుత్వం గురించి మాట్లాడితే బాగుండదులే’ అని హెచ్చరిక కూడాచేశారు.
అమె ఎందుకు ఇలాంటి సలహా ఇచ్చారంటే, లోకేశ్ బాబు తెలంగాణాలో ఏర్పాటు చేసిన చిన్న జిల్లాల మీద ఎక్సపర్ట్ కామెంట్ చేశారు. ఇది ఏ మాత్రం కవితకు నచ్చలేదు.
’ తెలంగాణాలో చాలా చిన్న చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారు. మరీ చిన్న జిల్లాలయితే, అడ్మినిస్ట్రేషన్ ఖర్చు పెరుగుతుంది. చూద్దాం, తెలంగాణా పరిస్థితి ఎలా ఉంటుందో. రాష్ట్రంలో ఇంకా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి,’ అని లోకేశ్ బాబు అన్నారు.
చిన్న రాష్ట్రం తెలంగాణా తెచ్చుకుని చిన్న జిల్లాలు ఏర్పాటుచేసుకుంటున్నపుడు పక్క రాష్ట్రం లోకేశుడు ఇలా మాట్లాడటానికి ఆమె అభ్యంతరం చెప్పారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నీపనేదో నువ్వు చూసుకో బాబూ అనేశారు.
’ ఈ ప్రకటన లోకేశ్ బాబు అమాయకత్వానికి అద్దం పడుతుంది. తెలంగాణా పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇలాగయితే మేమూ ఆంధ్రప్రదేశ్ గురించి చాలా మాట్లాడాల్సి ఉంటుంది,’ ఆమె హెచ్చరిక చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తెలుగుదేశం ప్రచారం నాయకత్వం వహించి పూర్తిగా దెబ్బతిన్నాక టిఆర్ ఎస్ నాయకులకు లోకేశ్ బాబు అలుసయినట్లుంది. తెలంగాణా విషయాలమీద ఒక పార్టీ జాతీయ కార్యదర్శిని మాట్లాడవద్దంటే ఎలా? అసలు ఆమె తెలుగుదేశం పార్టీని గుర్తించి నట్లే లేదు. తెలుగుదేశం అనే అపోజిషన్ పార్టీ పేరే చెప్పకుండా కేవలం కాంగ్రెస్ మాత్రమే మా ప్రత్యర్థి అనే దోరణి ప్రదర్శించారు.
ఆస్తుల వివరాల వెల్లడించి అదొక స్వఛ్చ పాలన చెప్పుకోవడం గురించి మాట్లాడుతూ అస్తుల వెల్లడి మీద తమకు మరొకరి సలహాలు అవసరం లేదని ఆమె అన్నారు. "చంద్రబాబు నాయుడులా మేము అడ్డగోలుగా సంపాదించలేదు, ఎవరికి లెక్కలు చూపించాలో వారికే లెక్కలు చూపిస్తాం" అని కవిత వ్యాఖ్యానించారు. అన్నా హజారేలమని చెప్పుకొని ఆస్తులు ప్రకటించుకోవటం హస్యాస్పదంగా లేదూ అని అన్నారు.
2019లో తెలంగాణాలో గెలిచేది టిఆర్ఎస్ యే నని, కాంగ్రెస్ గల్లంతయిపోతుందని అనడంలో అర్థమిదేనేమో.
టిఆర్ ఎస్ అధికారంలో ఉన్న గత రెండున్నరేండ్ల కాలంలో తెలంగాణలో సంస్కృతిక స్వర్ణయుగం కవిత అన్నారు. ఇది ఇక ఇలాగే కొనసాగాలని చెబుతూ తొమ్మిది దేశాలలో తన నాయకత్వంలోని జాగృతి నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయని, దీని వల్ల ప్రవాస తెలంగాణా వాసులు ఒకరికొకరు దగ్గరయ్యారని అమె చెప్పారు. జాగృతి నిర్వహించిన ఈ బతుకమ్మ పండుగలలో ప్రవాస తెలంగాణవాసులే కాకుండా అక్కడి దేశాల ప్రజల కూడా పాల్గొనడం తెలంగాణ సంస్కృతి గొప్పదనమని ఆమె చెప్పారు.