లండన్‌లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ... ‘‘దేశ్ కీ నేత కేసీఆర్’’ నినాదాలతో హోరెత్తిన టవర్ బ్రిడ్జి

By Siva KodatiFirst Published Dec 13, 2022, 10:22 PM IST
Highlights

విదేశాల్లో మొట్టమొదటి సారిగా లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్‌ను జెండాను ఆవిష్కరించారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్. త్వరలో బీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించి పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు.

టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా ఆమోదిస్తూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ క్రమంలో విదేశాల్లో మొట్టమొదటి సారిగా లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్‌ను జెండాను ఆవిష్కరించారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్. ఈ సందర్భంగా దేశ్ కీ నేత కేసీఆర్, అబ్ కీబార్ కిసాన్ సర్కార్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. 

ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. లండన్‌లోని చారిత్రక టవర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించడం గర్వంగా వుందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ జెండాను తొలిసారి లండన్‌లోనే ఎగురవేసి కేసీఆర్ నాయకత్వానికి మద్ధతు తెలిపామని అశోక్ గుర్తుచేశారు. నేడు దేశంలో గుణాత్మక మార్పు కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండాను లండన్‌లోనే మొట్టమొదట ఎగురవేశామని ఆయన తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమని ఎన్ఆర్ఐలు విశ్వసిస్తున్నారని అశోక్ పేర్కొన్నారు. 

Also Read:ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ వ్యూహాలు : జేడీ లక్ష్మీనారాయణతో తలసాని భేటీకి యత్నం, నెక్ట్స్ స్టెప్ ఏంటో..?

యూకేలో వున్న ఎన్ఆర్ఐలంతా బీఆర్ఎస్‌లో చేరడానికి ఆసక్తిగా వున్నారని ఆయన తెలిపారు. త్వరలో బీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించి పార్టీ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామని అడ్విసోరీ  బోర్డు వైస్ చైర్మన్  చందుగౌడ్ సీక తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, కార్యదర్శి సత్య చిలుముల,  కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య చిలుముల, శ్రీకాంత్ జెల్ల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, అధికార ప్రతినిధులు రవిప్రదీప్ పులుసు, రవి రేతనేని, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, కోర్ కమిటీ సభ్యులు అబ్దుల్ జాఫర్, పృథ్వీ రావుల, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 

click me!