2లక్షల మంది ఇండియన్లకు రిలీఫ్: వీసా పాలసీపై కోర్టు నిషేధం

By rajashekhar garrepallyFirst Published May 7, 2019, 11:39 AM IST
Highlights

అక్రమ నివాసం ఉన్న వారిపై నిషేధం విధించాలని అమెరికా చేసిన వీసా చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒక జిల్లా ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు లక్షల మంది భారతీయులకు ఉపశమనం లభించనున్నది. 
 

వాషింగ్టన్: విదేశీ విద్యార్థులు అమెరికాలో అక్రమంగా నివసించకుండా అరికట్టే ఓ ప్రతికూల విధానాన్ని యూఎస్‌సీఐఎస్ (అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ) అమలు చేయకుండా అమెరికా జిల్లా కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది.

ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కాకున్నా, ప్రస్తుతం జారీ అయిన తాత్కాలిక ఆదేశాలతో అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న దాదాపు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు ఊరట లభించనుంది. 

గత ఏడాది ఆగస్టు 9 నుంచి అమలులోకి వచ్చిన యూఎస్‌సీఐఎస్ విధానం ప్రకారం.. అక్రమంగా నివసిస్తున్న విద్యార్థులను నిర్దిష్ట కాలం వరకు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. 180 రోజులు అక్రమంగా నివసించిన వారిపై మూడేళ్లు, ఏడాదికి పైగా నివసించిన వారిపై పదేళ్ల నిషేధం విధించనున్నారు. 

ఈ నిషేధం సదరు విద్యార్థులపై ఆధారపడిన వారికి, వారి జీవిత భాగస్వాములకు, పిల్లలకు కూడా వర్తిస్తుంది. దీనిపై పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. విదేశీ విద్యార్థుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశాయి. 

అమెరికాలో నివసించేందుకు అనుమతించిన కాలం పూర్తి కాకపోయినా.. ఓ విద్యార్థి తెలిసో తెలియకో తన విద్యార్థి వీసాను ఉల్లంఘించినట్టు తేలితే.. ఆ రోజు నుంచే అతడు/ఆమె అక్రమంగా నివసిస్తున్నట్టు పరిగణిస్తారు. ఈ విషయం ఏడాది తరువాత వెలుగులోకి వస్తే.. సదరు విద్యార్థిపై పదేళ్లు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. 

ఈ విధానం విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం చేస్తుందని పలు విద్యా సంస్థలు కోర్టుకు విన్నవించాయి. ఈ చట్టం నేషనల్ ఇమ్మిగ్రేషన్ అండ్ వీసా చట్టంతో విభేదిస్తున్నదని వారు వాదించారు.

click me!