ఆదా చర్యలు.. మూడు రెట్లు ఆదాయం పెంచుకున్న జొమాటో

By Siva KodatiFirst Published Oct 3, 2019, 3:54 PM IST
Highlights

ఇటీవల 500 మంది ఉద్యోగులను తొలగించి వేసినా.. పలు ఆదా చర్యలతో ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగేటర్ ‘జొమాటో’ రూ.1458 కోట్ల ఆదాయం పొందింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికం.
 

ఇటీవల ఉద్యోగాల కోత విధించి వార్తల్లో నిలిచిన ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆదాయంలో దూసుకుపోతోంది. ఒకవైపు దేశమంతా ఆర్థిక మందగమనం పరిస్థితులు భయపెడుతున్నా.. జొమాటో మాత్రం  రాకెట్ వేగంతో గణనీయ వృద్ధిని నమోదు చేసింది.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తోలి ఆరు నెలల్లో తన ఆదాయంలో ఏకంగా మూడు రెట్లు వృద్ధి రేటును నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో కంపెనీ రూ 1,458 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

గతేడాది సరిగ్గా ఇదే సమయంలో జొమాటో ఆదాయం కేవలం రూ 448 కోట్లు మాత్రమేనని జొమాటో వ్యవస్థాపక సీఈఓ దీపిందర్ గోయెల్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. 

జొమాటో నెలవారీ బర్నింగ్ రేటు (నష్టాలు) కూడా 60శాతం  మేరకు తగ్గినట్లు గోయెల్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవడంతో అద్భుతమైన ఫలితాలను సాధించామన్నారు.

ప్రధానంగా నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ)  లాగ్అవుట్ ప్రచారం ఉన్నా డైన్-అవుట్ రెస్టారెంట్లు తమ జొమాటో గోల్డ్ పథకానికి మంచి ఆదరణ లభించిందని వెల్లడించారు. 

జొమాటో దేశంలోని 500 నగరాలూ, పట్టణాల్లో ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తోందని దీపిందర్ గోయల్ తెలిపారు. దేశవ్యాప్తంగా సహకార మార్జిన్ సానుకూలంగా ఉన్నాయన్నారు. టాప్ 15 నగరాల్లో కంపెనీ ఆర్డర్లు గత 12 నెలల్లో రెట్టింపయ్యాయి. మిగతా నగరాలు ఇప్పటికే ఆర్డర్ వాల్యూమ్‌లకు 35 శాతం దోహదం చేశాయని గోయల్ చెప్పారు. 

గతేడాది ఇదే సమయంలో కంపెనీ కేవలం 200 నగరాలూ, పట్టణాల్లో ఉండేది. ఇలా భారీగా విస్తరించటంతో ఆదాయాల్లో అధిక వృద్ధి సాధ్యం అవుతోందన్నారు.

ఆగస్టు 15 తరువాత నుంచి భారతదేశంలో 6,300 రెస్టారెంట్లు జోమాటో గోల్డ్‌లో ఉన్నాయనీ, వీటితో పాటు ఇటీవల ప్రారంభించిన జోమాటో గోల్డ్‌లో డెలివరీ కోసం 10,000 రెస్టారెంట్లు కలిసాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

కాగా జొమాటో సుమారు 540 మంది ఉద్యోగులకు ఇటీవలే ఉద్వాసన పలికింది. టెక్నాలజీ అభివృద్ధి చేయడం, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వంటి సరి కొత్త టెక్నాలజీ వాడకం ద్వారా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించింది.

అనేక ప్లాన్లు తమ బిజినెస్ మోడల్‌కు విరుద్ధంగా ఉన్నాయని రెస్టారెంట్ల యజమానులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు జోమాటో గోల్డ్ పటిష్టంగా ఉన్నామని జొమాటో నమ్ముతున్నా ఇది   ఆమోదయోగ్యంకాని ప్రతిపాదన అని ఎన్ఆర్ఏఐ వ్యాఖ్యానించింది. 

click me!