జొమాటో ‘పొదుపు’ మంత్రం’: 541 మందికి ఉద్వాసన

By narsimha lodeFirst Published Sep 9, 2019, 10:55 AM IST
Highlights

జోమాటో పొదుపు మంత్రం పాటిస్తుంది. 541 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఆర్ధిక మాంధ్యం నేపథ్యంలో ఈ  నిర్ణయాన్ని తీసుకొంది జొమాటో.

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ పొదుపు మంత్రం పాటిస్తోంది. అందులో భాగంగా వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివ్రుద్ధి చేయడం కోసం సుమారు 541 మంది ఉద్యోగులపై వేటు వేసింది. 

దేశవ్యాప్తంగా జొమాటో సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కస్టమర్ కేర్ ద్వారా వినియోగదారులు అడిగే ప్రశ్నలకు ఇకపై ఆటోమేషన్ ద్వారానే జొమాటో జవాబులు ఇవ్వనున్నది.

‘కొన్ని నెలలుగా మా సంస్థలో ఆర్డర్లు బాగా పెరిగాయి. కానీ వేగంలో లోపం వల్ల కొన్ని రద్దు అవుతున్నాయి. ఈ క్రమంలో టెక్నాలజీని ఉపయోగించుకునే ఉద్దేశంతో దాన్ని పరీక్షించాం. టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతోంది. ఆర్డర్‌కు సంబంధించిన ప్రశ్నలన్నింటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ద్వారా సమాధానాలు చెప్పదలుచుకున్నాం’ అని జొమాటో పేర్కొంది.

‘అందుకే సపోర్ట్ టీమ్‌లో దేశవ్యాప్తంగా 541 మందిని తొలగించనున్నాం. ఇది చాలా బాధ కలిగించే విషయమని మాకు తెలుసు. అలాగని ఇప్పుడే వారిని బయటకు పంపించేయం. 2-4 నెలలు వారు ఇక్కడే పని చేసే అవకాశం కల్పిస్తాం. 2020 జనవరి వరకు తొలిగించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యం కల్పిస్తాం’ అని జొమాటో ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా జొమాటో ఇటువంటి సంచలన నిర్ణయమే తీసుకున్నది. సుమారు 5000 రెస్టారెంట్లను తమ జాబితా నుంచి తొలిగించినట్లు తెలిపింది. ఎఫ్ఎష్ఎష్ఎఐ నిర్దేశిత ప్రమాణాలను సదరు హోటళ్లు అందుకోలేకపోయినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని జొమాటో వివరించింది. 

తాము ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు పూర్తిగా తు.చ. తప్పకుండా అమలు చేస్తామని జొమాటో తెలిపింది. దేశంలోని 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకున్న సంస్థలతో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తామని వెల్లడించింది. జొమాటోతో అనుబంధం గల 80 వేల రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తామని పేర్కొంది. 

click me!