ట్విట్టర్ సీఈఓకు షాక్: డోర్సీ ఖాతా హ్యాక్

By narsimha lodeFirst Published Sep 1, 2019, 12:07 PM IST
Highlights

సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విట్టర్’ సీఈఓ జాక్ డోర్సీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు హ్యాక్ చేశారు. అవమానకర, విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్ లో బాంబు ఉందని, హిట్లర్ అమాయకుడని రకరకాల ట్వీట్లతో 15 నిమిషాలు ఆటాడుకున్నారు. తర్వాత ట్విట్టర్ మేనేజ్మెంట్ అలర్టయి ఆ ట్వీట్లు, రీ ట్వీట్లు తొలిగించేశారు. 

ట్విటర్‌ సీఈవో, సహ వ్యవస్థపాకుడు జాక్ డోర్సీ ట్విటర్‌ ఖాతాకే దిక్కులేకుండా పోయింది. డోర్సీ ఖాతాను శుక్రవారం మధ్యాహ్నం హ్యాక్ చేసిన హ్యాకర్లు వివాదాస్పద ట్వీట్లతో దడ పుట్టించారు.

ప్రధానంగా ట్విటర్‌ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందంటూ ట్వీట్‌ చేయడం కలకలం రేపింది. దీంతోపాటు జాత్యహంకార, దేశ విద్రోహపూరిత కామెంట్లు ఉండటంతో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. 

దాదాపు 40 లక్షల మంది ఫాలోయర్లు ఉన్న ట్విటర్‌ సీఈవో అకౌంట్‌నే హ్యాక్‌ చేసి సైబర్ నేరగాళ్లు భారీ షా​కిచ్చారు. స్వయంగా సంస్థ సీఈవో ఖాతాకు భద్రత లోపించడం చర్చనీయాంశమైంది. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన ఖాతాను స్వాధీనం చేసుకున్న హ్యకర్లు అనుచిత ట్వీట్లు చేశారు. 

నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నిర్దోషి, అమాయకుడంటూ ట్వీట్‌ చేశారు. నల్లజాతీయులు, యూదుల గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. ట్విటర్‌  ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందని సూచించే ట్వీట్ కూడా ఉంది.

అయితే  హ్యాకింగ్‌ను  పసిగట్టిన భద్రతా సిబ్బంది  డోర్సీ ఖాతాను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక గంటలోపు సదరు ట్వీట్లను, రీట్వీట్లను తొలగించారు. కొన్ని ట్విటర్‌  ఖాతాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసారు.. 

మరోవైపు డోర్సీ ట్విటర్‌ ఎకౌంట్ ఎలా హ్యాక్‌ అయిందన్న దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ట్విటర్‌ అధికార ప్రతినిధి తెలిపారు. భద్రతా పరిశోధకుడు బ్రియాన్ క్రెబ్స్ మాట్లాడుతూ, సిమ్ మార్పిడి లేదా బాధితుడి ఫోన్ నంబర్‌ద్వారా హ్యాకింగ్‌ జరిగినట్టు గుర్తించామన్నారు.  మొబైల్ ప్రొవైడర్ భద్రతా లోపం వల్ల అకౌంట్‌తో లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను హ్యక్ చేసారన్నారు. 

కాగా డోర్సీ ఖాతా హ్యాక్‌ అవడం ఇదే తొలిసారి కాదు. 016లోనూ ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. దీంతోపాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ట్విట్టర్ ఖాతాలను కూడా హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. 

click me!