పాపులర్ బ్రాండ్ గూగుల్‌: తర్వాతీ జాబితాలో వాట్సాప్+యూట్యూబ్

By Siva KodatiFirst Published Aug 25, 2019, 1:20 PM IST
Highlights

ఇంటర్నెట్ సెర్చింజన్ ‘గూగుల్’ భారతదేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిచింది. తర్వాతీ జాబితాలో వాట్సాప్, యూట్యూబ్ నిలిచాయి. అంతర్జాతీయంగానూ గూగుల్ టాప్ పాపులర్ బ్రాండ్‍గా నిలుస్తోంది.

భారత్‌లో అత్యంత జనాధరణ కల బ్రాండ్ల జాబితాలో ఇంటర్నెట్‌ సెర్చింజిన్‌ గూగుల్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వాట్సాప్‌, యూట్యూబ్‌ కొనసాగుతున్నాయని లండన్‌లోని మార్కెట్‌ పరిశోధన, డేటా విశ్లేషణ సంస్థ 'యూగౌ' తెలిపింది.

బ్రాండ్ హెల్త్ ర్యాంకింగ్స్ పేరిట యూగౌ ర్యాంకింగ్
‘బ్రాండ్‌ హెల్త్‌ ర్యాంకింగ్స్‌’ పేరిట పది సంస్థలకు ఇది రేటింగ్‌ ఇచ్చింది. వాటిలో స్విగ్గీకి ఐదవ ర్యాంక్‌, మేక్‌మైట్రిప్‌కు ఆరో ర్యాంక్‌ లభించాయి. నాణ్యత, విలువ, సంతృప్తి, పేరు ప్రతిష్టలతోపాటు యూజర్లు ఇతరులకు వీటిని సిఫారసు చేసే విధానాన్ని బట్టి యూగౌ సంస్థ ఈ ర్యాంకింగ్‌లనూ కేటాయించింది. 

ఇలా యూగౌ ర్యాంకింగ్స్
భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్న ఇతర ప్రజాదరణ పొందిన బ్రాండ్లల్లో అమెజాన్‌కు నాలుగో ర్యాంక్‌, ఉబర్‌కు ఏడో ర్యాంక్‌, ఫేస్‌బుక్‌, ఓలా, జుమాటోలకు వరుసగా ఎనిమిది, తొమ్మిది, పదవ ర్యాంకులు లభించాయి.

2018 జూలై ఒకటవ తేదీ నుంచి 2019, జూన్‌ 30 వరకు ఏడాది కాలాన్ని పరిగణలోకి తీసుకొని బ్రాండ్లకు ర్యాంకులను కేటాయించారు. మరోవైపు ప్రపంచ స్థాయి ర్యాంకుల్లో కూడా గూగుల్‌ మొదటి స్థానంలో ఉండడం విశేషం. 

వాట్సాప్, యూ ట్యూబ్ ఇలా 
ఆ తర్వాత స్థానాల్లో వరుసగా వాట్సాప్‌, యూట్యూబ్‌, శామ్‌సంగ్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఐకియా, నైక్‌, పేపాల్‌, నెట్‌ఫిక్స్‌ సాగుతున్నాయి. భారత్‌లో 2018లో ఉబర్‌ ఈట్స్‌, జొమాటో, స్విగ్గీ, ఇన్‌స్టాగ్రామ్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అమెజాన్‌ బ్రాండ్లు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చినట్టు 'యూగౌ' సంస్థ తెలిపింది.

రాజకీయ విశ్లేషణలు వద్దని ఉద్యోగులతో గూగుల్‌ వార్నింగ్
ప్రముఖ ఇంటర్నెట్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ తమ ఉద్యోగులకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. ఉద్యోగులుగా నియమించుకుంది పని చేయడానికే తప్ప రాజకీయ విశ్లేషణలు చేయడానికి కాదంటూ ఆ సంస్థ ఉద్యోగులను హెచ్చరించింది.

సంస్థ చరిత్రలో తొలిసారి ఉద్యోగులకు పని సంస్కృతిలో మార్పులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు గూగుల్‌ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ నుంచి ఉద్యోగులందరికీ మెయిల్‌ ద్వారా సూచనలు వెళ్లాయి. 

ఉద్యోగులు టీం స్పిరిట్‌తో పని చేయాలని గూగుల్ సూచన
టీం స్పిరిట్‌తో పనిచేయాలంటే ఉద్యోగులు తమ సహచరులతో సమాచారం, ఆలోచనలు షేర్‌ చేసుకోవాలి. అంతేకానీ తాజా రాజకీయ విశ్లేషణలు చేయడం వల్ల టీం స్ఫూర్తి ఏర్పడదని పేర్కొంది.

సంస్థ మనల్ని ఉద్యోగంలోకి తీసుకున్నది పని చేయడానికి అంతేకానీ రాజకీయ విశ్లేషణలు చేయడానికి కాదని సూచనల్లో పేర్కొంది. రాజకీయ నేతలు, ఇతర వర్గాలనుంచి వస్తున్న విమర్శలతో గూగుల్ ఈ నిబంధనలను విధించిందని సమాచారం. 

click me!