రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 14వేల మంది రైతులే కారు...మరి ఎవరంటే..: సజ్జల

By Arun Kumar PFirst Published Feb 6, 2020, 6:35 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్ర సమగ్రాభివృద్ది సాధ్యమని బలంగా నమ్ముతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. 

నెల్లూరు: పరిపాలనా వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తాము బలంగా నమ్ముతున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.  తాము రాజదానిని అమరావతి నుంచి ఎక్కడికీ తీసుకుపోవడం లేదన్నారు. ఒక రాజధాని అమరావతి లో మరొక రాజధాని వైజాగ్ లో ఇంకొక రాజధాని కర్నూలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇంకా బుద్ది రానట్లుందని విమర్శించారు. అధికారంలో వుండగా కళ్ళు నెత్తికెక్కినట్లు వ్యవహరించారు కాబట్టే ప్రజలు టిడిపిని పక్కనబెట్టారని అన్నారు. 

కేసులకు భయపడి తండ్రి కొడుకులు(చంద్రబాబు, లోకేష్) పారిపోయి హైదరాబాద్ నుండి అమరావతి వచ్చిపడ్డారని అన్నారు. అలాంటి నాయకులను కలిగిన టీడీపీ నేతలు నోటికొచ్చినట్లుగా సీఎంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. 

చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ది మాత్రం పెరగడం లేదని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర పరిధిలోని అంశమని... దీన్ని కేంద్ర ప్రభత్వమే ఒప్పుకుందని అన్నారు.

read more  ప్రభుత్వానికి నష్టం వచ్చినా సరే... అలాగే చేయండి...: అధికారులకు జగన్ ఆదేశం

 నిజంగా రాజధానిని జగన్ తన స్వప్రయోజనాల కోసమే మార్చాలని అనుకుంటే ఏ ప్రకాశం జిల్లాలోనో పెట్టేవారని... ఆయన అలా ఆలోచించలేదు కాబట్టే విశాఖ, కర్నూల్ లకు తరలించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో విశాఖను రాజధాని కోసం ఎంచుకున్నారని సజ్జల వెల్లడించారు. 

రాజధానిని అమరావతి నుండి మార్చలేదు... మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నాము అని వివరించారు.  వికేంద్రీకరణ ఎందుకు చేస్తున్నారో సీఎంకు స్పష్టత వుందన్నారు.

టిడిపి హయాంలో అమరావతి నిర్మాణం కోసం చాలా మంది రైతులు భూములిచ్చారని.... అయితే వారిలో దాదాపు 14 వేల మంది అసలు రైతులే కాదన్నారు. కానీ వారు రైతుల  రూపంలో చెలామణి అవుతూ ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నారని సజ్జల ఆరోపించారు. 

read more  రాజధాని మార్పు నిర్ణయం ప్రజల కోసం కాదు... కేవలం వారికోసమే..: తులసిరెడ్డి

చంద్రబాబు భూములు, టీడీపీ నాయకులు భూముల రేట్లు తగ్గిపోతాయని ఆందోళన చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు అప్పు తెచ్చిన మూడు లక్షల కోట్లలో ఒక లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మూడు రాజధానులు వలన ఉత్తరాంద్ర రాయలసీమ అభివృద్ధి చెందుతాయని అన్నారు. 

కీయా పరిశ్రమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... చంద్రబాబు బతుకు అంతా మీడియా మేనేజ్ మెంట్ తోనే సాగుతోందన్నారు. కియా పరిశ్రమ ఎందుకు పక్క రాష్ట్రానికి తరలిపోతుందో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చెస్తే లీగల్ గా ప్రొసీడ్ అవుతామని హెచ్చరించారు.

ఎన్‌సిఆర్ అనేది రాష్ట్రానికి అవసరం లేదన్నారు. ఏపిలోని ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలగనీయబోమన్నారు. ఎన్‌పిఆర్ ను కూడా తాము అంగీకరించమని... ముస్లింల క్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని సజ్జల వెల్లడించారు. 

click me!