ఆంధ్రప్రదేశ్ యువతని వల్డ్ క్లాస్ స్కిల్ ఫోర్స్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: గౌతమ్ రెడ్డి

By Arun Kumar PFirst Published Jan 28, 2020, 8:43 PM IST
Highlights

కొత్త శాఖ బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డితో సహా సంబంధిత శాఖాధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రివ్యూ  సమావేశం నిర్వహించారు.   

అమరావతి: ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యమని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. యువతకు ఉపాధి అవకాశాలను నైపుణ్య శిక్షణతో అపారంగా అందించాలన్నారు మంత్రి. తాజాగా ముఖ్యమంత్రి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ బాధ్యతలు అప్పగించిన అనంతరం సంబంధిత శాఖాధికారులతో మంగళవారం సచివాలయంలో తొలిసారి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

దానికిముందు మంత్రి గౌతమ్ రెడ్డి తన కొత్త శాఖ బాధ్యతలు తీసుకున్న అనంతరం జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డితో సహా, సంబంధిత శాఖాధికారులు మంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. 

ట్రైనింగ్, ఎంప్లాయ్ మెంట్ లో  ‘నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్ వర్క్ (NSQF)’ ప్రామాణికమన్నారు. వేర్వేరు శాఖల మధ్య సమన్వయం, జాప్యం ఉండొద్దనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖను సృష్టించారని మంత్రి మేకపాటి సమీక్షలో స్పష్టం చేశారు. 

read more ఏపి మండలిరద్దుకు కేసీఆర్ సాయం...జగన్ కోసం క్షుద్ర పూజలు...: బుద్దా వెంకన్న సంచలనం

కార్పొరేషన్లు, శిక్షణ , విద్య, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి ఇలా సుమారు 30 రకాల విభాగాలను సమ్మిళితం చేసి ఒక తాటిపైకి తీసుకురావడంలో యువత పట్ల సీఎం చొరవకు నిదర్శనమన్నారు.  ఏపీ యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందిండంలో రాజీపడకుండా ముందుకు వెళ్లాలని మంత్రి తెలిపారు. ఉద్యోగ నియామకాల్లోనూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఇందుకు గానూ ట్రైనింగ్, ప్లేస్ మెంట్స్ వంటి విషయాలలో జాతీయ స్థాయిలో పేరున్న సంస్థ ‘నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్ వర్క్స్ (NSQF) ను ప్రామాణికంగా తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్య నుంచే విద్యార్థులకు నైపుణ్య శిక్షణను తప్పనిసరిగా చేయాలని అధికారులు మంత్రికి ఇచ్చిన సలహాలు, సూచనల అనంతరం మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్ని ఐటిఐ, జూనియర్ కళాశాలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయో అధికారుల ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో యువతకు నైపుణ్య శిక్షణలో అవలంబిస్తున్న పద్ధతులు, అనుసరిస్తున్న విధానాలపై మంత్రి ఆరా తీశారు. 

read more  వికేంద్రీకరణ దిశగా మరో అడుగు... ఉత్తర్వులు జారీచేసిన జగన్ ప్రభుత్వం

ఇప్పటికే రాష్ట్రంలో రెండు నైపుణ్య విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాష్ట్ర యువత భవిష్యత్ కు మంచి మలుపుగా మారుతుందని మంత్రి మేకపాటి అధికారుల వద్ద ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో 25 స్కిల్ కాలేజీలను తీసుకువచ్చే రూట్ మ్యాప్ అంతిమదశకు చేరుకుందని మంత్రి తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రితో జరిగే సమీక్షలో వీటిపై పూర్తి వివరాలు అందించనున్నామన్నారు మంత్రి మేకపాటి.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జి.అనంత రామ్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి,  సాంకేతిక విద్య ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం నాయక్ ,ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ సీహెచ్ఐ ఛైర్మన్ హేమచంద్రారెడ్డి , బ్రాహ్మణ, కాపు, బీసీ కార్పొరేషన్ల ఎండీలు, ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

click me!