కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం.. అతడిపైనే అనుమానాలు..!!

By Sumanth KanukulaFirst Published Oct 29, 2023, 12:52 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఇంట్లో ఓ యువకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడిని ఎమ్మెల్యేకు దూరపు బంధువుగా గుర్తించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఇంట్లో ఓ యువకుడి మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుడిని ఎమ్మెల్యేకు దూరపు బంధువుగా గుర్తించారు. ఈ ఘటన బీహార్‌లోని నవాడా జిల్లాలో చోటుచేసుకుంది. హిసువా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే నీతూ సింగ్‌కు జిల్లాలోని నర్హత్ గ్రామంలో ఇల్లు ఉంది. నీతూ సింగ్‌కు చెందిన ఇంటిలోని ఓ గదిలో పీయూష్ సింగ్ మృతదేహం లభించింది. అతడు నీతూ సింగ్‌కు దూరపు బంధువు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో నీతూ సింగ్ అక్కడ లేరని, ఆమె కుటుంబం కూడా గ్రామంలో నివసించడం లేదని తెలుస్తుంది.

నీతూ సింగ్ గత కొన్ని రోజులుగా పాట్నాలో ఉంటున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడ లేరు. ఆ ఇంట్లో నీతూ సింగ్ బావ అయిన సుమన్ సింగ్ కుమారుడు గోలు సింగ్ అనే వ్యక్తి అక్కడ నివసిస్తున్నాడు మరియు అతని గదిలోనే పీయూస్ సింగ్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 

శనివారం సాయంత్రం ఈ ఘటనకు సంబంధించి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. నార్హట్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని చెప్పారు. ఓ గదిలో మృత దేహం లభించిందని.. మృతదేహంపై గాయాల గుర్తులు కనిపించాయని తెలిపారు. బాధితుడిని కొట్టి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సాక్ష్యాలను సేకరించేందుకు ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపామని చెప్పారు. అయితే ఈ ఘటనలో గోలు సింగ్‌ ప్రమేయం ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  పీయూష్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా గోలు సింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, నీతూ సింగ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ‘‘ప్రాథమికంగా మేము గోలు సింగ్‌ను అనుమానిస్తున్నాము. ఇప్పటి వరకు ఎటువంటి అరెస్టులు చేయలేదు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోస్ట్‌మార్టం పూర్తి చేసిన తర్వాత, సంఘటన జరిగిన ఖచ్చితమైన సమయం మాకు తెలుస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాజౌలీ ఎస్‌డీపీఓ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశాం’’ అని నవాడా ఎస్పీ అంబరీష్ రాహుల్ చెప్పారు.

click me!