
బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి బహిష్కరానికి గురైన హిందూ శరణార్థుల కుటుంబాలకు సహాయం చేస్తానని గతంలో ఇచ్చిన హామీని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలబెట్టుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 63 హిందూ శరణార్థ కుటుంబాలకు నివాస, వ్యవసాయ భూమి పత్రాలను మంగళవారం ఆయన అందజేశారు.
బంగ్లాదేశ్ నుండి వచ్చిన 63 శరణార్థ కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ముఖ్యమంత్రి ఆవాస్ యోజన’ పథకం కింద ఇళ్ల కోసం లేఖలతో పాటు వ్యవసాయ, నివాస భూమికి సంబంధించిన హక్కు పత్రాలను అందించారు. కార్యక్రమం యూపీ రాజధాని యూపీ రాజధాని లక్నోలో జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి బహిష్కరించబడిన హిందువులకు ఉత్తరప్రదేశ్లో నివాస, వ్యవసాయ భూములు అందించి వారికి వసతి కల్పిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శరనార్థ కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి విముక్తి కలిగించి అందజేస్తామని చెప్పారు.
ఆక్రమణదారుల నుంచి విముక్తి పొందిన భూములన్నింటినీ ‘ల్యాండ్ బ్యాంక్’ కిందకు తీసుకువస్తామని తెలిపారు. ఈ భూములను పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర వ్యాపారాల స్థాపన కోసం రెండు దేశాల నుంచి వచ్చిన హిందూ శరణార్థుల పునరావాసం కోసం వినియోగిస్తామని సీఎం యోగి చెప్పారు. ఈ శరణార్థ కుటుంబాలకు ముఖ్యమంత్రి గృహ నిర్మాణ పథకం కింద 2 ఎకరాల భూమి, లక్షా 20 వేల రూపాయిలు అందిస్తున్నామని తెలిపారు.
నిజానికి 1971లో ఇల్లు వదిలి వెళ్లిన ఈ కుటుంబాలు 51 ఏళ్లుగా ప్రవాస జీవితం గడుపుతున్నాయి. వీరంతా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో అయితే పునరావాస శాఖ వద్ద సరిపడా భూమి లేదు. అయితే ప్రభుత్వ భూమి ఆక్రమణల నుంచి విడిపించడంతో శరనార్థులందరికీ రసూలాబాద్లో అందించారు. అందులో భాగంగా 63 కుటుంబాలకు పునరావాసం కోసం, వ్యవసాయం కోసం రెండెకరాల భూమి అందించారు. మొత్తంగా 126 ఎకరాల భూమిలో ఈ కుటుంబాలు స్థిరపడనున్నాయి. ప్రతీ కుటుంబానికి గృహ నిర్మాణానికి 200 చదరపు మీటర్ల స్థలం అందజేశారు. అలాగే ఈ కుటుంబాలు MNREGAతో అనుసంధానించబడతాయి. శరనార్థ కుటుంబాల కోసం ప్రభుత్వం 300 ఎకరాల భూమిని గుర్తించిందని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ భూమిలో సాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తామని సీఎం చెప్పారు.