వారిని కించపరచాలని నా ఉద్దేశ్యం కాదు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై రాందేవ్ బాబా క్షమాపణలు..

By SumaBala BukkaFirst Published Nov 28, 2022, 12:46 PM IST
Highlights

మహిళలపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో యోగా గురు క్షమాపణలు తెలిపారు. 

ముంబయి : తన వ్యాఖ్యలతో తరచూ వివాదాల్లో చిక్కుకునే  రాందేవ్ బాబా  మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. ఈ యోగా గురువు  మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు  దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.  మహిళా సంఘాల నుంచి  తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.  ఆయన మీద   కఠిన చర్యలు తీసుకోవాలి  అన్ని వైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో యోగా గురు రాందేవ్ బాబా  ఆ వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణలు చెప్పుకొచ్చారు.  మహిళలను కించపరచడం,  అవమానించడం తన ఉద్దేశం కాదని అని.. అలాంటి ఆలోచన తనకు లేదని… తాను చేసిన  వ్యాఖ్యలతో..  ఎవరికైనా బాధ కలిగితే  తనను క్షమించాలని  రాందేవ్ బాబా కోరారు.

గత వారం ఓ సందర్భంలో రాందేవ్ బాబా మాట్లాడుతూ..  దుస్తులు  వేసుకోకపోయినా  మహిళలు  అందంగానే ఉంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలను  మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది.  రాందేవ్ బాబాకు  దీని మీద నోటీసులు జారీ చేసింది. దీంతో రాందేవ్ బాబా స్పందించారు.  తాను చేసిన వ్యాఖ్యల  మీద  క్షమాపణలు తెలిపారు.  ఈ మేరకు  మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకాంకర్ ట్విట్టర్ లో  తెలిపారు. తన పోస్టుకు రాందేవ్ బాబా రాసిన  లేఖను కూడా  జతచేశారు.

బట్టలు లేకున్నా నా కంటికి మహిళలు అందంగా కనిపిస్తారు .. బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

‘సమాజంలో మహిళలు  గౌరవప్రదమైన  స్థానంలో ఉండాలని  నేను కోరుకుంటాను. ఆ ఉద్దేశంతోనే మహిళల సాధికారత కోసం  నేను ఎల్లప్పుడూ  కృషి చేస్తూ ఉంటాను. అందుకోసమే.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కూడా నేను ప్రోత్సహిస్తాను. మహిళలను అగౌరపరిచేలా అన్నా ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు.  ఆ వీడియో  పూర్తిగా నిజం కాదు. అయినా కూడా..  నావల్ల ఎవరైనా బాధపడితే..  బాధ పడిన వారికి నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని రాందేవ్ బాబా తనకు వచ్చిన నోటీసులకు బదులుగా సమాధానమిచ్చారు.

 ఇదిలా ఉంటే, గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠానేలో ముంబై మహిళా పతంజలి యోగా సమితి, పతంజలి యోగా పీఠ్ లు సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ శిబిరానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవీస్ తో సహా అనేకమంది మహిళలు హాజరయ్యారు.యోగా శిక్షణ కార్యక్రమం తరువాత ఒక ప్రత్యేకత సమావేశం కూడా జరిగింది. దీంతో యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు.. వాటిని మార్చుకునే అవకాశం దొరకలేదు. ఇది గమనించిన రాందేవ్ బాగా ఆ పరిస్థితిపై స్పందించారు. స్త్రీలు ఎలా ఉన్నా అందంగానే ఉంటారని,  చీరల్లో, సల్వార్ సూట్ లలోనే కాదు… తనలాగా అసలేం వేసుకోకపోయినా బాగుంటారని వ్యాఖ్యానించారు. ఆయన అన్న మాటలకు మహిళలు ఇబ్బంది పడ్డారు. వెంటనే ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన క్షమాపణలు తెలిపారు.

click me!