
దేశంలో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఎండల ధాటికి గడప దాటాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రోడ్లపై చెప్పులతో నడవాలంటేనే కష్టం. అలాంటిది ఏకంగా చెప్పులు లేకుండా కాళ్లకు ప్లాస్టిక్ కవర్లు చుట్టుకుని నడిస్తే. ఊహించడానికే కష్టంగా వుంది కాదు. కానీ మధ్యప్రదేశ్లోని ఓ మహిళ తన పేదరికం కారణంగా పిల్లలకు చెప్పులు కొనలేని పరిస్థితుల్లో వారి పాదాలకు పాలిథిన్ కవర్లను చుట్టింది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళను రుక్మిణిగా గుర్తించారు. మే 21న మధ్యాహ్నం షియోపూర్ నగరంలోని రోడ్లపై తన పిల్లలతో కలిసి ఆమె వెళ్తుండగా.. ఇన్సాఫ్ ఖురేషీ అనే జర్నలిస్ట్ వారిని గమనించి ఫోటో తీశాడు.
రుక్మిణీ ఆమె పిల్లల దీనస్థితికి చలించిపోయిన ఖురేషి ఆ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేయడమే కాకుండా వారు పాదరక్షలు కొనుక్కునేందుకు వీలుగా నగదు అందించాడు. సహరియా రిబల్ కమ్యూనిటీకి చెందిన రుక్మిణి తన ఆర్ధిక పరిస్ధితులను ఆయనకు వివరించింది. తన భర్త క్షయ వ్యాధితో బాధపడుతున్నారని.. ఆయన వైద్యం కోసం ఉన్నదంతా ఖర్చు చేశామని రుక్మిణి చెప్పింది.
ఇలాంటి పరిస్ధితుల్లో కుటుంబ పోషణ కోసం నగరంలో ఏదైనా పని వెతుక్కుందామని వచ్చినట్లు ఆమె పేర్కొంది. తన ముగ్గురు పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేకోపవడంతో .. వారిని కూడా తన వెంట తీసుకొచ్చినట్లు రుక్మిణి చెప్పింది. రుక్మిణి పరిస్ధితిని తెలుసుకున్న స్థానిక అధికార యంత్రాంగం వారిని అదుకునేందుకు ముందుకు వచ్చింది. వీరి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు గాను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిబ్బందిని పంపారు.