Bengaluru: ఎయిర్ పోర్టులో మరో యువతి అదృశ్యం.. నైట్ డ్యూటీకి వెళ్లి.. ?

By Rajesh KarampooriFirst Published Jan 4, 2024, 11:32 PM IST
Highlights

Bengaluru: బెంగళూర్ లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో యువతి అదృశ్యమైంది. ఇలా నెల వ్యవధిలో మహిళ అదృశ్యం కావడం ఇది రెండో సారి.  నాలుగు నెలల్లో ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి.  

Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూర్ లో మరో యువతి అదృశ్యమైంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)లోనిటెర్మినల్ 1లోని క్యాబ్ కంపెనీలో బుకింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల యువతి ఆచూకీ గత నాలుగు రోజులుగా లభించలేదు. దీంతో ఆ యువతి సోదరుడు బుధవారం కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరుకు చెందిన నేత్ర విట్ క్యాబ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ విమానాశ్రయానికి సమీపంలోని హుణసామరనహళ్లిలోని ‘యమునా’ పీజీ వసతి గృహంలో నివసిస్తోంది. ఆమె ప్రతిరోజూ తన కుటుంబానికి ఫోన్ చేసి వారితో మాట్లాడేది. డిసెంబర్ 29న మధ్యాహ్నం ఫోన్ చేసి ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్నానని చెప్పింది. డిసెంబర్ 30 నుంచి ఆమె కుటుంబానికి ఎలాంటి కాల్స్ రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. ఛార్జ్ అయిపోయిందని తొలుత భావించారు. డిసెంబర్ 31న  మరోసారి నేత్రాకు ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. 

ఈ క్రమంలో నేత్ర సోదరుడు మహేష్ కుమార్ జనవరి 2న విట్‌ని సందర్శించి ఏం జరిగిందో పరిశీలించారు. తన సోదరి నేత్ర డిసెంబర్ 29వ తేదీన నైట్ షిఫ్ట్ ముగించుకుని ఉదయం 6 గంటలకు బయలుదేరిందని అక్కడి కంపెనీ సిబ్బంది తెలిపారు. అతను తన సోదరి స్నేహితులు, పరిచయస్తులతో మాట్లాడాడు. కానీ,  ఆమె ఆచూకీ గురించి ఎవరికీ తెలియదు. దీంతో అతడు తన సోదరి నేత్ర తప్పిపోయిందని మిస్సింగ్ కేసు పెట్టాడు.  

ఒక నెల వ్యవధిలో మహిళ అదృశ్యం కావడం ఇది రెండో కేసు. గడిచిన నాలుగు నెలల్లో ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 3న ఇండిగో కార్గో విభాగంలో ఉద్యోగం చేస్తున్న 22 ఏళ్ల యువతి కూడా మిస్సయింది. ఆమె జాడ తెలియకపోవడంతో ఆ యువతి మహిళ తల్లి పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్ని రోజులైన ఫలితం లేకుండా పోయింది.

అలాగే.. డిసెంబర్ 4న విమానాశ్రయం( KIA) నుండి బీహార్‌కు వెళ్లిన ఒక వ్యక్తి తన గమ్యస్థానానికి చేరుకోలేదు.  విమానాశ్రయం లోపల అదృశ్యమయ్యాడనే ప్రచారం జరుగుతోంది. అలాగే.. గతేదాడి సెప్టెంబరు 17న ఢిల్లీ నుండి విమానంలో వచ్చిన ఓ వ్యక్తి టెర్మినల్ 1 నుండి అదృశ్యమయ్యాడు

click me!