వసంత సేనన్ నలుగురు అక్కలు గురుప్రభు ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. దీంతో వారికి ప్రభు కుటుంబసభ్యులతో గొడవ జరిగింది. గురుప్రభు కుటుంబసభ్యులు కర్రలు, కత్తులతో నలుగురిపై దాడిచేశారు.
క్రికెట్ లో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ.. ఓ యువతి ప్రాణాలు పోవడానికి కారణమైంది. కాగా.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై పోలీసు కేసు కూడా నమోదయ్యింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... తంజావూరు జిల్లా కార్కవాయల్ గ్రామానికి చెందిన శక్తివేల్ (55), సుందరి దంపతులకు షణ్ముగప్రియ (24), కౌసల్య (23), సత్య (22), ఫౌసియా (21) అనే కుమార్తెలు, వసంతసేనన్ (19) అనే కుమారుడున్నాడు. వీరింటి పక్కనే నివసిస్తున్న కుబేంద్రన్ (60), సరోజ దంపతులకు గురుప్రభు (28) అనే కుమారుడున్నాడు.
శనివారం వసంతసేనన్, గురుప్రభులు క్రికెట్ ఆడు తుండగా వివాదం చెలరేగి, వసంత్పై ప్రభు దాడిచేశాడు. ఈ విషయం తెలుసుకున్న వసంత సేనన్ నలుగురు అక్కలు గురుప్రభు ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. దీంతో వారికి ప్రభు కుటుంబసభ్యులతో గొడవ జరిగింది. గురుప్రభు కుటుంబసభ్యులు కర్రలు, కత్తులతో నలుగురిపై దాడిచేశారు.
ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన షణ్ముగప్రియ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. గాయపడిన మిగిలిన వారిని చుట్టుపక్కల వారు పట్టుకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పట్టుకోట తాలూకా పోలీసులు కుబేంద్రన్, అతని భార్య సరోజ, కుమారుడు గురుప్రభులపై హత్యానేరం కింద కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.