
ముంబై : ముంబైలోని సకినాకా ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం కదులుతున్న ఆటోలో ఓ వ్యక్తి మహిళ గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అదే ఆయుధంతో తనను తాను గాయపర్చుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఖైరానీ రోడ్లోని దత్ నగర్లో ఈ ఘటన జరిగినట్లు సకినాకా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
"కదులుతున్న ఆటోలో దీపక్ బోర్సే, పంచశిలా జమదార్ అనే మహిళ గొంతు కోసాడు. ఆమె తప్పించుకోవడానికి ఆటో దిగి, పరుగెత్తింది. కానీ, కొంత దూరంలో పడిపోయింది. ఆమె గొంతు కోసిన దీపక్ అదే పదునైన ఆయుధంతో తన మెడను కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు," అని పోలీసులు తెలిపారు.
"విషయం గమనించిన బాటసారులు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితుడు కోలుకుంటున్నాడు" అని తెలిపారు.
మహిళ, నిందితులు ఒకరికొకరు తెలుసునని, ఆటోలో వెడుతున్న సమయంలో వారి మధ్య తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. దీపక్ మీద హత్య కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోందని పోలీసు అధికారి తెలిపారు.