
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లోని సాగర్లో ఒక మహిళను బస్టాండ్లో దారుణంగా కొట్టారు. గత నెల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో మహిళను కర్రలతో కొట్టి, ముఖంపై తన్నినట్లు కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్లోని సాగర్ నగరంలో బస్టాండ్లో మహిళను దారుణంగా కొట్టిన వీడియో వైరల్ కావడంతో గురువారం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
కేంద్రమంతి నివాసంలో మృతదేహం : పిస్టోల్ నా కొడుకుదే.. కానీ, ఆ సమయంలో అతను ఇంట్లో లేడు... కౌశల్ కిషోర్
వైరల్ అయిన ఆ వీడియోలో.. బాధిత మహిళను ఈడ్చుకెళ్లి, కర్రలతో కొట్టారు. ముఖంపై తన్నారు. ఆ సమయంలో ఆమె ఐదు నెలల పసికందును సమీపంలో నేలపై పడుకోబెట్టి ఉంది. ఇదంతా వీడియోలో చూపించారు.
దీనికి సంబంధించి నిందితులుగా ప్రవీణ్ రైక్వార్ (26), విక్కీ యాదవ్ (20), రాకేష్ ప్రజాపతి (40)లను గోపాల్గంజ్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ లోకేష్ సిన్హా తెలిపారు.
స్థానిక సమాచారం ప్రకారం, పోలీసులు నిందితులను కోర్టుకు తీసుకెళుతున్న సమయంలో రోడ్డుపై పరేడ్ చేయిస్తూ తీసుకెళ్లారు. కోర్టు వీరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆగస్టు 12-13 మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది. ఘటన జరిగిన బస్టాండ్లోని క్యాంటీన్లో పాలు కొనేందుకు ఆ మహిళ వెళ్లింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. క్యాంటీన్లోని ముగ్గురు వ్యక్తులు ఆమెను కొట్టారని పోలీసులు తెలిపారు.
ఆ వీడియోలో ఆమె తనను కొడుతున్న వారిని దీనంగా వేడుకుంటూ... ‘భయ్యా.. భయ్యా’ అంటూ ఏడుస్తున్నట్లు కనిపించింది. చుట్టుపక్కల వారు ఆమెను కొట్టవద్దని నిందితులను ఆపడం, అరవడం వినిపించింది. సాగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ తివారీ మాట్లాడుతూ ఆ మహిళకు మతిస్థిమితం సరిగా లేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిమీద విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.