
చాలా మంది పామును చూస్తే చాలు అక్కడి నుంచి పరుగులు తీస్తారు. కానీ ఓ మహిళ మాత్రం తన ఇంట్లోకి వచ్చిన పాములో కలిసి నాలుగు రోజులు గడిపింది. ఆ పామును.. చనిపోయిన తన భర్త పునర్జన్మ అని నమ్మి.. దానికి హాని చేయవద్దని చుట్టుపక్కల వారిని కోరింది. ఈ అనుహ్య ఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. రాబకవి సమీపంలోని కులహళ్లి గ్రామానికి చెందిన శారద మౌనేష్ కుంబార్ భర్త మౌనేష్ కుంబార్ కుండలు తయారుచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే అతడు రెండేళ్ల క్రితం మృతిచెందాడు.
కొద్దిరోజుల క్రితం వర్షం కురిసిన రాత్రి కిటికీలోంచి శారద ఇంట్లోకి పాము ప్రవేశించింది. మరుసటి రోజు ఉదయం శారద ఇంట్లో పాము ఉన్న విషయాన్ని గమనించింది. శారద పామును ఇంట్లో నుంచి వెళ్లగొట్టలేదు. పాముకు ఏమాత్రం భయపడలేదు. పాము రూపంలో వచ్చింది తన భర్తేనని, దానికి ఎవరూ హాని చేయవద్దని చుట్టుపక్కల వారితో చెప్పింది. శారద పాముకు పాలు, నీరు పోసి ఇంట్లోనే ఉంచుకున్నట్టుగా ఆమె చుట్టుపక్కల వారు తెలిపారు. పాము శారదకు ఎలాంటి హాని చేయకపోవడంతో ఆమెకు నమ్మకం బలపడిందని చెప్పారు. ఇలా నాలుగురోజుల పాటు పాము.. శారద ఇంట్లోనే ఉంది.
పామును ఇంట్లో ఉంచుకోవడం వల్లే శారదకు ప్రమాదం ఉందని ఆందోళన చెందిన గ్రామస్తులు, బంధువులు.. ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. శారద పామును తన భర్త పునర్జన్మ అని నమ్మడంతో ఆమెకు నచ్చజెప్పడం వారికి కష్టంగా మారింది. చివరకు కొంతమంది బంధువులు, గ్రామస్తులు.. పామును ఇంటి నుంచి బయటకు పంపించేందుకు ఆమెను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. వర్షం పడినప్పుడు అడవి నుండి వచ్చిన సరీసృపాలు దారి తప్పి వెచ్చదనం కోసం ఇంట్లోకి వచ్చినట్టుగా చెప్పారు. దీంతో శారద తన ఇంటి నుంచి పామును తీసుకెళ్లేందుకు అంగీకరించింది.
అయితే పాముకు ఎలాంటి హాని చేయవద్దని గ్రామస్తులను కోరింది. పామును ఓ సంచిలో వేసి నది ఒడ్డున వదిలేయాలని తెలిపింది. అయితే శారద ఇంట్లో పాము ఉండటంతో.. అటువైపుగా వెళ్లేందుకు చుట్టుపక్కలవారు భయపడ్డారు.