
ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఏది అంటే ఠక్కున చైనా అనే సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఈ స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రస్తుతం భారతదేశ జనాభా సుమారు 143 కోట్లు దాటేసింది. అయితే కొత్తగా జన్మించే వారి సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైనాలో ఇప్పటికే యువకుల సంఖ్య భారీగా తగ్గుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం కూడా ప్రజలను పిల్లలను కనాలని ప్రోత్సహిస్తోంది. కానీ యువత మాత్రం పెళ్లి, పిల్లలకు మొగ్గు చూపడం లేదు.
భారత్లో తగ్గుతోన్న యువ జనాభా ఎందుకు తగ్గుతోంది.?
భారత్లో యువ జనాభా తగ్గడానికి ప్రధాన కారణాల్లో జననాల రేటు తగ్గడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. యువత కెరీర్ మీద సారించిన దృష్టి పిల్లల్ని కనడంపై సారించడం లేదని చెబుతున్నారు. ఇక ఆర్థిక పరిస్థితులు కూడా ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు. పిల్లల పెంపకం ఖర్చుతో కూడుకున్న అంశంగా కొందరు జంటలు భావిస్తున్నారు. ఇక సమాజంలో వస్తున్న వస్తున్నా మార్పులు, ఆలస్యంగా వివాహాలు కావడం కూడా జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి.
దేశంలో జననాల రేటు తగ్గితే యువ జనాభా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. దీంతో పని చేసే వారు తక్కువ అవుతారు. ఇది కార్మికశక్తి తగ్గడానికి దారితీసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలపై పింఛన్, ఆరోగ్య సేవల భారం పెరిగే అవకాశం ఉంటుంది. దేశంలో ఉత్పత్తి తగ్గుతుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పెరుగుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
'ఒకప్పుడు ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అని తానే చెప్పానని, కానీ ఇప్పుడు కచ్చితంగా ఎక్కువ మంది పిల్లల్ని కనండి' అంటూ ఏపీ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జనాభా తగ్గిపోతోందని… ప్రపంచం ముసలిదైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలే భావితరానికి ఆస్తి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పనిచేసే వారు ఉండరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనమని తరచూ చెబుతున్నారు. మొన్నటికి మొన్న కొత్త జంటలు ఏకంగా 16 మంది పిల్లల్ని కనమని పిలుపునిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ కోణం దాగి ఉంది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేపట్టేందుకు కసరత్తు మొదలు పెట్టిది. జనాభా ప్రాతిపదిక ఎంపీ సీట్లను నిర్ణయించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం.
రాష్ట్రానికి అధికంగా ఎంపీ స్థానాలు కావాలంటే ఎక్కువ జనాభా ప్రామాణికంగా కనిపిస్తోందని. అందుకే కొత్త జంటలు వీలైనంత వరకు ఎక్కువగా పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. తాజాగా సోమవారం నాగపట్టణంలో జరిగిన ఓ వివాహా వేడుకు హాజరైన స్టాలిన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనొద్దని కొన్నేండ్ల క్రితం తానే చెప్పానని కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయన్నారు.
అందుకే ఇప్పుడు అలాంటి సలహా ఇవ్వనన్న స్టాలిన్ అధిక జనాభా ఉంటేనే రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ స్థానాలు వస్తాయి. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. జనాభాను నియంత్రించడంపై తమిళనాడు శ్రద్ధ చూపి విజయం సాధించింది. నేటి రాష్ట్ర దుస్థితికి అదే కారణం. పెండ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనండి. వారికి అందమైన తమిళ పేర్లు పెట్టండి అంటూ పిలుపునిచ్చారు.
దక్షిణాది రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై కూడా స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. భాష విషయానికొస్తే ఉద్యమం చేయడానికి కూడా తాము సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఉత్తరాదిలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే ఏ భాష నేర్పిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ చేశారు. ఈ విషయమై ఆయన పోస్ట్ చేస్తూ.. 'తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొంత మంది మమ్మల్ని అడుగుతున్నారు. కానీ, ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషనను నేర్పిస్తున్నారో చెప్పడం లేదు. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది' అంటూ ప్రశ్నించారు.