
దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్మీ ఉద్యోగార్థులకు ప్రతిపక్ష నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గియా ఓ ప్రకటన చేశారు. తమ పార్టీ కార్యాలయాల్లో ‘అగ్నివీర్స్’ ను సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవడానికి తాను ఇష్టపడుతానని అన్నారు.
ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణ, ఆదేశాలను పాటించడం సాయుధ దళాల్లో ముఖ్యమైన భాగమని ఆయన అన్నారు. ‘‘ అగ్నివీర్ 21 ఏళ్ల వయసులో సాయుధ దళాల్లో చేరాడనుకోండి, అప్పుడు అతడు దళాలను విడిచిపెట్టే సమయానికి 25 ఏళ్లు వస్తాయి. అతని చేతిలో రూ. 11 లక్షల నగదు ఉంటుంది. అతడి ఛాతీపై ‘అగ్నివీర్’ పతకం గర్వంగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ కార్యాలయానికి భద్రత కోసం నేను ఎవరినైనా నియమించుకోవాల్సి వస్తే, నేను ఆయనకు ప్రాధాన్యత ఇస్తాను ’’ అని కైలాష్ విజయ వర్గియా అన్నారు.
చెప్పులు కుడుతున్న సివిల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్.. వైరల్ అవుతున్న ఫొటోలు
అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో విజయ వర్గియా ట్వీట్ లో స్పందించారు. టూల్ కిట్ ముఠా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు. టూల్ కిట్ తో సంబంధం ఉన్న వ్యక్తులు తన ప్రకటనను వక్రీకరించడం ద్వారా అగ్నివీర్ లను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారు చేసిన కుట్రల గురించి దేశానికి బాగా తెలుసని ఆయన తెలిపారు.
కాగా ఆయన ప్రకటనపై శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘ సెక్యూరిటీ గార్డులుగా మారడానికి మన సాయుధ దళాలు అగ్నివీర్స్ కు శిక్షణ ఇస్తాయి. యూనిఫారంలో ఉన్న మన పురుషుల ప్రాముఖ్యతను ఇది చిన్నచూపు చూస్తోంది. ’’ అని ఆమె అన్నారు. అయితే ఈ పథకం కింద నియామకాలు చేపట్టే వారికి డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్లు, ఇతర నైపుణ్యాలలో శిక్షణ ఇస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి గతంలో చెప్పారు.
సైన్యంలో పనిచేయడం ఒక ప్రతిష్టాత్మక వృత్తి అని, దీనికి మరేది సాటిరాదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘‘ వారు భారతదేశం కోసం చంపడానికి లేదా చవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ వారు డ్రైవర్లుగా పని చేయాలనుకుంటే నాలుగేళ్లపాటు సైన్యంలో ఎందుకు గడపాలి ? ‘'అగ్నివీర్స్’ను బీజేపీ చౌకీదార్లుగా మాత్రమే చూస్తోందని స్పష్టమవుతోంది ’’ అని ఒవైసీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ భద్రతతో ఆడుకుంటున్నారని, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
Jammu Kashmir: ఉగ్రవాదులు-భద్రతా బలగాలకు మధ్య కాల్పులు.. నలుగురు టెర్రరిస్టులు హతం
ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను త్రివిధ దళాల్లో సర్వీసుల్లోకి తీసుకుంటారు. వీరికి ఆరు నెలల శిక్షణ కాలం ఉంటుంది. దీని ద్వారా మహిళలు, పురుషులను ఇద్దరినీ రిక్రూట్ చేసుకుంటారు. ఈ అభ్యర్థులు నెలకు మొత్తం అలవెన్సులతో కలుపుకొని రూ. 30 నుంచి 40 వేల రూపాయిల జీతం అందుతుంది. 90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.