
International Labour Day: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మిక వర్గాల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పిన సీఎం కేసీఆర్.. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే 1) సందర్భంగా ఆయన కార్మికాలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకొంటూ విజయవంతంగా అమలవుతున్నదని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టి జరుగుతున్నదని, అది దేశాభివృద్ధికి దోహదపడుతున్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కార్మికుల కష్టానికి తగిన ఫలాలు అందుతున్నాయన్నారు. మేడే సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రధాన అధికారిక కార్యక్రమంలో ఆయన మరో ముగ్గురు మంత్రులు మెహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి పాల్గొన్నారు. కార్మిక సంఘాలు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించి తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాలనే తేడా లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి బోర్డు ద్వారా గతేడాది రూ.176.91 కోల్లు లబ్ది చేకూర్చామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 32,350 మంది కార్మికులకు రూ.184.07 కోట్ల మేర ప్రయోజనం పొందారన్నారు. అలాగే, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఆయన దేవరుప్పులలో యువ చైతన్య యూత్ ఆటో యూనియన్, కామారెడ్డి గూడెంలో హమాలీ సంఘం, పాలకుర్తిలో సీఐటీయూ అధ్వర్యంలో మేడే జెండాలను ఆవిష్కరించారు.