
తిరువనంతపురం: కేరళలో వరదలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఆర్మీ, నేవీతో పాటు పలు విభాగాలు పనిచేస్తున్నాయి. అయితే ఓ ఇంట్లో చిక్కుకొన్న 26 మందిని కాపాడేందుకు భారతీయ నావికాదళానికి చెందిన హెలికాప్టర్ను పైలెట్ ఇంటి పైకప్పుపై నిలిపాడు. అయితే వరద బాధితులు హెలికాప్టర్లో ఎక్కిన తర్వాత సురక్షితంగా వారిని పునరావాస కేంద్రాల్లోకి తరలించారు.
కేరళలోని చాలకుడిలో ఓ ఇంట్లో 26 మంది చిక్కుకొన్నారు. ఆ ప్రాంతానికి బోటు కూడ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో నావికాదళానికి చెందిన సీకింగ్ 42బీ హెలికాప్టర్ వెళ్లింది. అయితే ఆ ఇంటి చుట్టూ భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. హెలికాప్టర్ ఎక్కడ ల్యాంగ్ చేయాలో పైలెట్కు అర్థం కాలేదు.
అయితే ఈ సమయంలో బాధితులు చిక్కుకొన్న ఇంటిపైనే హెలికాప్టర్ను ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో బాధితులంతా హెలికాప్టర్లో ఎక్కారు. అయితే హెలికాప్టర్ను సురక్షితంగా పైలెట్ గాల్లోకి లేపాడు.
ఈ సమయంలో పైలెట్ ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా పెద్ద ప్రమాదం వాటిల్లేది. పైలెట్ సహా 26 మంది వరద బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. హెలికాప్టర్ బరువును ఇంటిపై మొత్తం పడకుండా గాల్లోనే హెలికాప్టర్ ను గాల్లో కొంచెం లేపి.. కొంచెం బరువును మాత్రమే ఇంటిపై మాత్రమే ఉండేలా చేసినట్టు పైలెట్ చెప్పాడు.
8నిమిషాల పాటు హెలికాప్టర్ ను అలా ఉంచినట్టు ఆయన చెప్పాడు. అయితే మరో నాలుగైదు సెకన్లు అలాగే ఉంటే హెలికాప్టర్ ముక్కలయ్యేది. కానీ, 26 మంది ప్రాణాలు కాపాడేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు.