
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో ఓ అవాంఛనీయ ఘటన జరిగింది. 13 ఏళ్ల విద్యార్థినికి ఓ 47 ఏళ్ల కీచక ఉపాధ్యాయుడు నిస్సిగ్గుగా లవ్ లెటర్ రాశాడు. అది చదివిన తర్వాత చించేయాలని అందులో సూచించాడు. ఆ లవ్ లెటర్ గురించి బాలిక తన తల్లిదండ్రులకు వివరించి చెప్పింది. దీంతో వారు ఆ ఉపాధ్యాయుడిని నిలదీశారు. కానీ, తన తప్పును గురించి పశ్చాత్తాపపడకుండా ఆ బాలిక తల్లిదండ్రులనే బెదిరించాడు. ఈ ఘటన కన్నౌజ్లో సదర్ కొత్వాలీ పోలీసు స్టేషన్ ఏరియాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
కన్నౌజ్లో 47 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను ఇష్టపడుతున్నట్టు లవ్ లెటర్ రాసి ఆమె చేతిలో పెట్టాడు. సింగిల్ పేజీలో రాసిన ఈ లెటర్ను ఆ బాలిక తల్లిదండ్రులకు చూపెట్టడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
లవ్ లెటర్ గురించి తెలియగానే ఆ టీచర్ దగ్గరకు వెళ్లి నిలదీశానని బాలిక తండ్రి తెలిపాడు. ఆ టీచర్ను క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశానని వివరించాడు. కానీ, ఆ టీచర్ అందుకు నిరాకరించాడు. అంతేకాదు, తర్వాత తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఆ అమ్మాయిని కనిపించకుండా చేస్తానని బెదిరించాడు.
అమ్మాయి పేరుతో మొదలు పెట్టిన ఆ లేఖలో తాను విద్యార్థినిని ప్రేమిస్తున్నాడని, హాలీడేస్లో చాలా మిస్ అవుతానని పేర్కొన్నాడు. ఆ అమ్మాయిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారని రాశాడు. ఒక వేళ వీలు దొరికితే తనకు ఒక్కసారైనా కాల్ చేయాలని ఆ టీచర్ తన లేఖలో తెలిపాడు. సెలవుల కంటే ముందు ఒక్కసారైనా తనను కలువాలని, ఆమె తనను నిజంగా ప్రేమిస్తే తప్పకుండా తనను కలవడానికి వస్తుందని రాశాడు. ఈ లేఖను చదివిన తర్వాత చింపేయాలని సూచించాడు.
పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్పీ కున్వార్ అనుపమ్ సింగ్ తెలిపారు. దర్ాయప్తు ప్రారంభించామని వివరించారు. తాము కూడా ఒక టీమ్ ఏర్పాటు చేశామని, దీనిపై నివేదిక కోరామని, ఆ టీచర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కౌస్తుబ్ సింగ్ తెలిపారు.