
ఉత్తర్ ప్రదేశ్ : ఇల్లు అద్దెకిచ్చిన పాపానికి ఆమె అనుకోని చిక్కుల్లో పడింది. కొత్త జంట కదా అని అద్దెకిస్తే.. యజమానురాలికే షాకిచ్చారు ఆ యువజంట. గది నచ్చిందని, అద్దె బేరాలు ఆడకుండా ఒప్పుకోవడంతో ఆమె కూడా సంతోషంగా ఇంటి తాళాలు చేతిలో పెటింది. కానీ మూడోరోజే ఆ జంట ఉరేసుకుని తన ఇంట్లోనే మరణించడంతో ఆమె షాక్ లో పడింది.
ఉత్తరప్రదేశ్లోని అలీగడ్ జిల్లాలోని అట్రౌలీ పరిధిలో ఉన్న మొహల్లా సరైవలీ ప్రాంతంలో సుశీలాదేవి అనే మహిళ ఇంట్లోకి ఓ జంట అద్దెకు దిగారు. విమ్లేష్ దేవి అనే మహిళను తన భార్యగా యజమానురాలికి పరిచయం చేసి రవి.. అనే వ్యక్తి అద్దె ఇంట్లో కొత్త కాపురం మొదలుపెట్టారు.
అయితే వాళ్లు అద్దెకు దిగిన మూడో రోజే ఆదివారం తీవ్ర దుర్వాసన రావడం మొదలైంది. ఏమయిందా? ఏంటా? అని యజమానురాలు వెళ్లి పరిశీలిస్తే.. గదిలో ఫ్యాన్కు ఆ కొత్తజంట ఉరేసుకుని కనిపించారు.
దీంతో భయాందోళనకు గురైన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ‘కొద్దిరోజుల క్రితమే పెళ్లి అయింది అన్నారు. అద్దె గది కావాలన్నారు. ఇచ్చాను. అంతకుమించి నాకేమీ తెలియదు. పెద్దగా బయట కనిపించకపోవడంతో కొత్తగా పెళ్లయింది కదా అని అనుకున్నాను. కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదు’ అంటూ యజమానురాలైన సుశీలాదేవి వాపోయింది.
ఇక పోలీసుల విచారణలో మరో షాకింగ్ నిజం తెలిసింది. రవి విమ్లేష్ దేవి పెళ్లి చేసుకున్న సంగతి నిజమే. కానీ, అంతకుముందే విమ్లేష్ దేవికి శిశుపాల్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆరేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. భర్తను, కొడుకును వదిలేసి.. పెళ్లికి ముందు నుంచి పరిచయమున్న రవితో వచ్చేసింది.
ఆ తర్వాత ఓ గుడిలో రవి, విమ్లేష్ దేవి పెళ్లి చేసుకున్నారు. అయితే తన భార్య కూడా కనిపించడం లేదంటూ విమ్లేష్ దేవి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిద్దరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాము ఇలా వచ్చేయడంతో ఊళ్లో వాళ్లు నానా మాటలు అంటున్నారని తెలిసి బాధతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను సొంతూళ్లకు తరలించి వారి బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు