
యూపీ (Up) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికలు అధికార బీజేపీ (bjp)కి, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ (samajwadi party)కి మధ్య హోరాహోరీగా సాగాయి. అయితే ఈ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. సారి మొట్టమొదటి సారిగా రెండు ముఖ్య పార్టీల సీఎం అభ్యర్థులు అసెంబ్లీకి పోటీ చేశారు. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) కర్హల్ (karhal) నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. బీజేపీ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటి సారిగా పోటీ చేసిన అఖిలేష్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఇంకా ఆ స్థానంలో కౌంటింగ్ కొనసాగుతోంది. గతంలో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన అఖిలేష్ యాదవ్ ఒక్క సారిగా కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. శాసన మండలికి ఎన్నికై అక్కడి నుంచి రాష్ట్రాన్ని పాలించారు. కానీ సారి అసెంబ్లీ బరిలో నిలిచారు. దీంతో ఆయన విజయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఆయన మూడు సార్లు గోరఖ్ పూర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 ఎన్నికల సమయంలో కూడా ఆయన ఎంపీగానే ఉన్నారు. అయితే హైకమాండ్ ఆయనను సీఎం పగ్గాలు చేపట్టాలని సూచించడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు నిర్విరామంగా రాష్ట్రాన్ని పాలించారు. అయితే ఈ సారి ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తనకు పట్టున్న గోరఖ్ పూర్ ప్రాంతంలో నుంచే అసెంబ్లీ బరిలో నిలిచారు.
యూపీ ప్రస్తుత అసెంబ్లీ గడువు మార్చి 14తో ముగుస్తుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరిగాయి. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు సాగిందని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్, బీఎస్పీలు సైతం తమదైన తరహాలో ప్రచారం సాగిస్తూ.. ఎన్నికల బరిలో ముందుకుసాగాయి. మొదటి విడుతలో 58 స్థానాలకు పోలింగ్ జరగగా.. ఈ సారి 60.17 శాతం పోలింగ్ నమోదైంది. 2017 ఎన్నికలతో పోలిస్తే ( 63.5 శాతం) తక్కువగా ఉంది.
ఇక యూపీ రెండో విడత ఎన్నికల్లో తొమ్మిది జిల్లాల్లోని మొత్తం 55 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 50 శాతం కంటే అధిక ముస్లిం ఓటర్లు ఈ ప్రాంతంలో ఉండటంతో అన్ని పార్టీలు ఓటర్లకు గాలంవేసేలా ముందుకు సాగాయి. 61.20 శాతం ఓటింగ్ నమోదైంది. మూడో దశలో 16 జిల్లాల్లోని 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 623 మంది బరిలో నిలిచారు. కీలకమైన 16 జిల్లాల్లో ఐదు జిల్లాలు పశ్చిమ యూపీ, 6 అవధ్ ప్రాంతం, 5 బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దశలోనే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ , కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్, శివపాల్ యాదవ్ వంటి నేతలు పోటి పడ్డారు. అలాగే, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాలకు నాల్గో దశలో పోలింగ్ జరిగింది.
ఇక ఫిబ్రవరి 27న ఐదవ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు జరిగింది. మొత్తం 692 మంది బరిలోకి దిగగా.. వారిలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య , రాంపూర్ ఖాస్ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా , కుంట సీటు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా , యూపీ కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నవారిలో ప్రముఖులు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తల్లి, అప్నాదళ్ నేత కృష్ణా పటేల్ అప్నాదళ్ కే తరపున పోటీలో ఉన్నారు. 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో 6వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక సోమవారం నాడు (మార్చి 7) ఏడోదశ (చివరిదశ) ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 9 జిల్లాల్లోని 54 స్థానాలకు పోలింగ్ జరిగింది. 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.