
న్యూఢిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాలలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వేసవి కాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో మండు వేసవిలో పొగమంచు కురిసింది. గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు దారి కనిపించక ఇబ్బందులు పడ్డారు. సాధారణంగా ఢిల్లీలో మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. నగరంలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 39.5 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. ఎండలు మండిపోయే మే నెలలో సాధారణంగా ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉండవు.
గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం.. ప్రశాంతంగా వీచే గాలులు.. పగటిపూట, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉండటంతో పొగమంచు ఏర్పడేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ప్రాథమిక వాతావరణ కేంద్రం సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీ ప్రకారం.. అక్కడ గత 24 గంటల్లో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఢిల్లీలో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే తొమ్మిది డిగ్రీలు తక్కువ. ఇదిలా ఉంటే.. గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్ కాగా.. దీనిని గత 13 సంవత్సరాలలో మే నెలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతగా చెబుతున్నారు. ఇక, వాతావరణ నిర్వహణ ప్రారంభమైనప్పటి నుంచి ఆల్ టైమ్ కనిష్టంగా 1982 మే 2న 15.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక, ఢిల్లీలో శుక్రవారం నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.