
UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నూతన చైర్మన్గా మనోజ్ సోనీ నియమితులయ్యారు.
అయితే.. ఆయనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీకి సన్నిహితుడు. దీంతో దుమారం రేగుతున్నది. ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని యూపీఎస్సీ చైర్మన్గా ఎలా నియమిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు.
భారత రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ సర్కార్ దెబ్బ తీసుందనీ, క్రమంగా.. ఒక్కొక్క సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేస్తూ వస్తుందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. UPSC- Union Public Service Commission ని యూనియన్ ప్రచారక్ సంఘ్ కమిషన్ (Union Pracharak Sangh Commission)గా మారుస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలతో పాటుగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
మనోజ్ సోనీ ఏప్రిల్ 5న UPSC నూతన ఛైర్మన్గా నియమితులయ్యారు. మే 2017లో UPSC సభ్యునిగా ఉన్న సోనీ, అంతకుముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అహ్మదాబాద్, వడోదరలోని MS యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్గా సేవాలందించారు. అతను గుజరాత్లోని స్వామినారాయణ మతవర్గానికి చెందిన వాడు. 1991 నుంచి 2016 మధ్య సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం, వల్లభ్ విద్యానగర్లో పొలిటికల్ సైన్స్ ప్రొపెసర్ గా పనిచేశారు.
ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రసంగాలు రాసిపెట్టేవారు. అధినేతతో గల సాన్నిహిత్యం దృష్ట్యా ఆయనను చిన్న మోదీ అని పిలిచేవారు. 1998లో 'అండర్స్టాండింగ్ ది గ్లోబల్ పొలిటికల్ ఎర్త్క్వేక్' అనే పుస్తకంలో ప్రచురించబడిన 'ప్రచ్ఛన్న యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవస్థాత్మక పరివర్తన, ఇండో-యుఎస్ రిలేషన్స్'పై సోనీ డాక్టరల్ పరిశోధన జరిగిందని నివేదికలు పేర్కొన్నాయి.
గతంలో ఆయన వడోదరాలోని ఎంఎస్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా పనిచేశారు. అతిచిన్న వయసులో వీసీ పదవి చేపట్టిన వ్యక్తిగా సోనీ వార్తలకెక్కారు. ఆ పదవిలో ఆయన బీజేపీ, ఆరెస్సెస్కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుని విమర్శల పాలయ్యారు. గుజరాత్ మతకల్లోలాలను బీజేపీ కోణంలో విశ్లేషిస్తూ ఆయన రాసిన పుస్తకంపై కూడా విమర్శలు వచ్చాయి. చిన్నప్పటి నుంచి స్వామినారాయణ్ అనుపమ మిషన్లో పనిచేసిన సోనీని 2020 జనవరిలో మఠం ‘నిష్కామ కర్మయోగి’గా నియమించారు.
యూపీఎస్సీలో ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న వ్యక్తులను నియమించడంపై రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏమైనా ఉన్నాయా అని రాహుల్ అడిగారు. ఐఏఎస్ , ఐపీఎస్ ఇతర సేవలతో వివిధ అఖిల భారత సర్వీసుల అధికారుల నియామకానికి UPSC బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థకు ఇలాంటి వివాదస్పద వ్యక్తిని చైర్పర్సన్గా నియమించమేమిటని విమర్శిస్తున్నారు.