
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. సిద్ధరామయ్య సర్కార్ కొత్తగా రూపొందించిన ‘‘స్వావలంబిసారథి ’’పథకంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ పథకాన్ని తొలుత మైనారిటీలకు మాత్రమే అందుబాటులో వుంచారని.. అయితే తాను ట్వీట్ చేయడం, ప్రజల ఆగ్రహంతో ఈ పథకంలోకి ఓబీసీలను చేర్చుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
కానీ నేటికీ ఎస్సీ, ఎస్టీలను ఈ పథకం కిందకు తీసుకురాలేదని కేంద్ర మంత్రి మండిపడ్డారు. వీలైతే ప్రయత్నించి చూడాలని రాజీవ్ కోరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, యూపీఐ, ఇండియా కూటమి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. కానీ ప్రతి అడుగులోనూ వారు బయటపడుతున్నారని రాజీవ్ చంద్రశేఖర్ చురకలంటించారు.
జర్నలిస్టులను బెదిరించినా, అరెస్ట్ చేసినా నిజం బయటపడకుండా వుండదన్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు అన్ని విశ్వాసాల పట్ల చిత్తశుద్ధి కలిగి వుంటే.. వారు తప్పనిసరిగా ఈ పథకం లబ్ధిదారులను నెలవారీ ప్రాతిపదికన వెల్లడించాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ కోసం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు గతంలో తాను చేసిన ట్వీట్లను రాజీవ్ జత చేశారు.
గతంలో సెప్టెంబర్ 8న చేసిన ట్వీట్లోనూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం.. కొన్ని వర్గాలకు లంచాలు ఇచ్చి బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు. 50 శాతం సబ్సిడీని ఉపయోగించి రూ.6 లక్షల వాహనాన్ని కొనుగోలు చేయండి.. మరుసటి రోజు అదే వాహనాన్ని రూ.5 లక్షలకు విక్రయించండి, రూ.2 లక్షల నికర లాభం పొందండి అంటూ కాంగ్రెస్ కొత్త పథకంపై రాజీవ్ మండిపడ్డారు. ఈ సదుపాయం హిందూయేతర వర్గాలకు మాత్రమే అందుబాటులో వుందని, పేద హిందువులకు లేదని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించి కన్నడిగులందరికీ అందాల్సిన ప్రభుత్వ వనరులను నిర్ధిష్టమైన వర్గానికి లంచంగా ఇచ్చి వివక్ష చూపుతోందని రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పార్టీ రాజ్యాంగం ప్రమాదంలో పడిందని విదేశాల్లో గొంతు చించుకుంటూ వుంటుందని కేంద్ర మంత్రి చురకలంటించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత మార్పిడి కార్యక్రమమని ఆయన ఆరోపించారు.