Udhayanidhi Stalin: కేంద్ర మంత్రి అమిత్ షాపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. హిందీ భాష దేశ ప్రజలను కలిపి ఉంచుతుందనే వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు అర్థరహితమైనవని, దేశంలో హిందీ నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడుతారని, అలాంటప్పుడు అది భారతజాతి మొత్తాన్ని ఐక్యంగా ఉంచుతుందనడంలో అర్థం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Udhayanidhi Stalin: తమిళనాడు ప్రభుత్వ మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో నిలిచారు. సనాతన ధర్మం వ్యాఖ్యల తర్వాత ఇప్పుడూ హిందీపై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీని రుద్దుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి విరుచుకపడ్డారు.'4-5 రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడే' భాష దేశాన్ని ఎలా ఏకం చేయదని అన్నారు.
హిందీపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. "నాలుగు నుండి ఐదు రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడే హిందీ మొత్తం భారత యూనియన్ను ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం" అని అన్నారు. హిందీయేతర భాషలను ప్రాంతీయ భాషల హోదాకు దిగజార్చడం, వాటిని అవమానించడం మానేయాలి. తమిళనాడులో తమిళం, పొరుగు రాష్ట్రం కేరళలో మలయాళం అని డీఎంకే నేత ప్రశ్నించారు. ఈ రెండు రాష్ట్రాలను హిందీ ఎలా కలుపుతోంది? ఇది ఎలా సాధికారత కలిగిస్తుంది? అని ప్రశ్నించారు.దీంతో పాటు #StopHindiImposition అనే హ్యాష్ట్యాగ్ని జోడించారు.
అమిత్ షా ఏం చెప్పారు?
సెప్టెంబరు 14న హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషలతో కూడిన దేశమని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో భాషల వైవిధ్యాన్ని హిందీ ఏకం చేస్తుంది. హిందీ మరే ఇతర భారతీయ భాషలతో ఎన్నడూ పోటీపడదని, అన్ని భాషలను బలోపేతం చేయడం ద్వారానే బలమైన దేశం ఆవిర్భవించనుందని షా అన్నారు. అన్ని స్థానిక భాషలకు సాధికారత కల్పించేందుకు హిందీ మాధ్యమంగా మారుతుందని హోంమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.