కప్‌బోర్డ్‌లో కూతురు మృతదేహం.. మంచం కింద తల్లి శవం.. గుజరాత్ లోని ఆస్పత్రిలో దారుణం..

By SumaBala BukkaFirst Published Dec 22, 2022, 8:32 AM IST
Highlights

ఓ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లోని అల్మారాలో కూతురి మృతదేహం, మంచం కింద తల్లి మృతదేహం లభించడం గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

అహ్మదాబాద్ : గుజరాత్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఆస్పత్రికి వైద్యానికి వచ్చిన తల్లీకూతుళ్లు..దారుణమైన స్థితిలో విగతజీవులుగా లభించారు. అహ్మదాబాద్‌లోని భులాభాయ్ పార్క్ సమీపంలోని ఆసుపత్రిలో తల్లీ, కూతురు మృతదేహాలు లభించడం కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు బుధవారం తెలిపారు. ఓ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లోని అల్మారాలో కూతురి మృతదేహం, మంచం కింద తల్లి మృతదేహం లభ్యమైంది. చికిత్స నిమిత్తం తల్లీ, కూతురు ఆస్పత్రికి వచ్చినట్లు ఏసీపీ మిలాప్ పటేల్ బుధవారం విలేకరులకు తెలిపారు.

మొదట కుమార్తె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. ఆమెతోపాటు వచ్చిన తల్లి ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. పోలీసులు విచారణలో భాగంగా ఆస్పత్రిలో గాలించగా  తల్లి మృతదేహాన్ని కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఆస్పత్రిలో పనిచేస్తున్న మన్‌సుఖ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సహజీవనానికి కనీస వయస్సు 18 ఏళ్లే.. తగ్గించే యోచన లేదన్న కేంద్రం

అహ్మదాబాద్‌లోని కాగ్డాపిత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూలాభాయ్ పార్క్ సమీపంలో ఉన్న ఆసుపత్రిలో తీవ్రమైనదుర్వాసన వస్తుండడంతో.. ఆస్పత్రి సిబ్బంది ఎక్కడినుంచి వస్తుందా అని వెతకడం ప్రారంభించారు. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లోని అల్మారా నుంచి దుర్వాసన వస్తుందని గమనించి.. ఆస్పత్రి సిబ్బంది తెరిచి చూశారు. 

అల్మారా లోపల 30 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో షాక్ అయిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత హత్యగా అనుమానించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే 30యేళ్ల మహిళ తల్లి మృతదేహాన్ని ఆస్పత్రి మంచం కింద కనిపెట్టారు.

click me!