
రాంచీ: జార్ఖండ్లో అక్రమ మైనింగ్ స్కామ్ కేసులో దర్యాప్తు జరుగుతున్నది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు సుమారు 20 చోట్ల తనిఖీలు చేసింది. ఇందులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడు ప్రేమ్ ప్రకాశ్కు చెందినట్టుగా చెబుతున్న ఇంటిలో రెండు ఏకే 47 రైఫిళ్లు దొరికాయి. అయితే, ఈ రెండు రైఫిళ్లు అక్రమంగా సంపాదించుకున్నవా? అనే విషయంపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ నుంచి స్పష్టత రాలేదు.
ఈ కేసు ప్రధానంగా అక్రమ మైనింగ్, ఎక్స్టార్షన్ కేంద్రంగా నమోదైంది. సుమారు రూ. 100 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
ఈడీ ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్ రాజకీయ సన్నిహితుడు పంకజ్ మిశ్రా, ఆయన సహచరుడు బచ్చు యాదవ్లను కస్టడీలోకి తీసుకుంది. వీరిని విచారించగా కొన్ని కీలక విషయాలు ఈడీకి తెలియవచ్చాయని ఈడీ వర్గాలు పీటీఐ ఏజెన్సీకి తెలిపాయి. వారు వెల్లడించిన విషయాల మేరకే ఈ రోజు దాడులు జరిగినట్టు వివరించాయి.