
న్యూఢిల్లీ : Dadar-Puducherry Express ట్రైన్ కి చెందిన మూడు కోచ్లు శుక్రవారం పట్టాలు తప్పాయి. ఇది ముంబైలోని మాతుంగా స్టేషన్ లో జరిగింది. దాదర్-పుదుచ్చేరి ఎక్స్ప్రెస్.. ముంబై CSMT గడగ్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని Central Railway officials సమాచారం అందించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
"మాతుంగా రైల్వే స్టేషన్ సమీపంలో చాళుక్య ఎక్స్ప్రెస్ , ముంబై CSMT గడగ్ ఎక్స్ప్రెస్ లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అయితే ఇది చాలా స్వల్పంగా జరగడంతో భారీ ప్రమాదం తప్పింది. మూడు బోగీలు పట్టాలు తప్పినా, ఎలాంటి ప్రాణనష్టం కానీ, గాయాలు కానీ కాలేదు. సబర్బన్ రైళ్లు మామూలుగానే నడుస్తున్నాయి" అని రైల్వే CP తెలిపారు.
పట్టాలు తప్పిన సమస్యను పరిష్కరించడానికి ఏడెనిమిది గంటల సమయం పడుతుందని సెంట్రల్ రైల్వే అదనపు జనరల్ మేనేజర్ బికె దాదాభోయ్ తెలిపారు. ఘటనాస్థలికి రిలీఫ్ రైళ్లను పంపినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) శివాజీ సుతార్ తెలిపారు. "మాతుంగా స్టేషన్ సమీపంలో 11005 దాదర్-పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ మూడు కోచ్లు పట్టాలు తప్పినట్లు మాకు రాత్రి 9:45 గంటలకు (ఏప్రిల్ 15) సమాచారం అందింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. భద్రతా కారణాల దృష్ట్యా మేం వెంటనే ప్రక్కనే ఉన్న లైన్ ట్రాఫిక్ను నిలిపివేశాం" అని చెప్పారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో కొంతకాలం కిందట భద్రతా కారణాల దృష్ట్యా నిలిపివేసిన అప్ అండ్ డౌన్ స్లో లైన్లో ట్రాఫిక్ను పునరుద్ధరించినట్లు సుతార్ తెలిపారు. "రాత్రి 10:45 గంటలకు (ఏప్రిల్ 15) స్లో లైన్ ట్రాఫిక్ను పునరుద్ధరించాం. దీంతో సబర్బన్ రైళ్లు స్లో లైన్లో నడుస్తున్నాయి. పట్టాలు తప్పిన రైలు ఫాస్ట్ లైన్లో ఉంది. వీలైనంత త్వరగా మేం 3 కోచ్లు, ఫాస్ట్ లైన్ ట్రాఫిక్ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం. అన్ని సహాయ రైళ్లు సైట్లో ఉన్నాయి" అని CPRO తెలిపారు.
"శనివారం ఉదయం వరకు ఫాస్ట్ లైన్ను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం. ఈ రైలు పట్టాలు తప్పడంపై విచారణ జరుగుతుంది, ఇది ఎవరి తప్పు అని ఇప్పుడే చెప్పలేం. ఘటనకు గల కారణం దర్యాప్తు తర్వాత బయటపడుతుంది" అని సుతార్ అన్నారు. ఇదిలావుండగా, రైల్వే కమిషనర్ ఆఫ్ పోలీస్, క్వాయిజర్ ఖలీద్ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాద స్థలి నుంచి ప్రయాణికులందరినీ ఖాళీ చేయించామని, వారు సురక్షితంగా ఉన్నారని తెలియజేశారు.
"మాతుంగ వద్ద ప్రమాద స్థలాన్ని సందర్శించారు. గడగ్ ఎక్స్ప్రెస్ను దాదర్ ఆర్ఎస్కి తీసుకెళ్తున్నాం. ప్రయాణికులందరూ, వారి వస్తువులు సురక్షితంగా ఉన్నాయి. చాళుక్య/పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ప్రయాణికులను ఖాళీ చేయించాం. సాధారణ స్థితిని పునరుద్ధరించడం జరుగుతోంది. దెబ్బతిన్న విద్యుత్ లైన్, స్తంభాన్ని పునరుద్ధరిస్తున్నారు" అని ఖలీద్ చెప్పారు. దాదర్ సమీపంలో దాదర్-పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దృష్ట్యా సెంట్రల్ రైల్వే హెల్ప్లైన్ కాంటాక్ట్ నంబర్ను కూడా జారీ చేసింది.
దీంతోపాటు దాదర్-పుదుచ్చేరి ఎక్స్ప్రెస్, CSMT-గడగ్ ఎక్స్ప్రెస్లు రద్దు చేశారు. "రద్దు చేసిన రైళ్లలోని ప్రయాణికులు రాబోయే మూడు రోజులపాటు ఏదైనా PRS కేంద్రం నుండి టికెట్ సొమ్ము వాపసును క్లెయిమ్ చేసుకోవచ్చు" అని ముంబైలోని సెంట్రల్ రైల్వేస్, CPRO, శివాజీ ఎమ్ సుతార్ తెలిపారు. ముంబైకి వచ్చే కొన్ని రైళ్లను దాదర్ స్టేషన్ వరకే నిలిపివేశారు. శనివారం సబర్బన్ రైళ్లు మెయిన్లైన్లో మాత్రమే సెలవు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని సెంట్రల్ రైల్వే సమాచారం.