
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ భర్త పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక ఓ భార్య ఘోరానికి పాల్పడింది. భర్తకు మత్తు మాత్రలు ఇచ్చి తర్వాత గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్నితన మైనర్ కుమారుడి సహాయంతో గోనెలో కుక్కి, సైకిల్ పై పార్క్ కు తీసుకెళ్లి అక్కడ వదిపెట్టారు. అయితే ఈ విషయం బయటకు రావడంతో ఆమెను అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాయువ్య ఢిల్లీలోని పితంపురాకు చెందిన భరత్లాల్ (32), లక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంత కాలం నుంచి భర్త మద్యానికి బానిసయ్యాడు. ఏ పని కూడా చేయడం లేదు. పైగా భార్యను తీవ్రంగా కొట్టేవాడు. చిత్ర హింసలు పెట్టేవాడు. ఇద్దరు మైనర్ పిల్లలను కూడా చితకబాదేవాడు. ఈ పనులు వల్ల భార్య లక్ష్మి తీవ్రంగా విసిగిపోయింది. దీంతో అతన్ని చంపాలని నిర్ణయించుకుంది.
కొంత కాలం కిందట లక్ష్మి అనారోగ్యం పేరుతో కొన్ని మత్తు మాత్రలు కొనుగోలు చేసింది. వాటిని ఇంట్లోకి తీసుకొచ్చి భద్రపర్చింది. అయితే ఈ నెల 9వ తేదీన రాత్రి భర్త ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో అతడు తాగే మద్యం సీసాలో దాదాపు 15 వరకు ఆ మత్తు మాత్రలు కలిపింది. ఈ విషయం తెలియక భరత్ లాల్ ఆ మద్యాన్ని సేవించాడు. అతడు మత్తులోకి జారుకున్నాక.. గొంతు నులిమి చంపేసింది.
అనంతరం ఆ మృతదేహాన్ని ఓ మైనర్ కుమారుడి సాయంతో గోనె సంచిలో కుక్కింది. ఆ సంచిని సైకిల్ పై పెట్టుకొని, దగ్గర్లోని ఓ పార్క్ సమీపంలో పడేశారు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు. అయితే ఏప్రిల్ 11వ తేదీన పితాంపురలోని మహిళా పార్క్ ప్రవేశ ద్వారం దగ్గర జూట్ బ్యాగ్లో ఓ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుడి ముక్కుపై రక్తం పడి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో మౌర్య ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్ లో ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 301, 201 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
ఈ దర్యాప్తులో మృతుడు భరత్లాల్ గా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె భార్య లక్ష్మిని పోలీసులు విచారించారు. తన భర్త ఏప్రిల్ 9వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో కూరగాయలు కొనేందుకు మార్కెట్కి వెళ్లినప్పుడు కనిపించకుండా పోయాడని విచారణలో లక్ష్మి పోలీసులకు తెలిపింది. ఆయన జాడ కోసం ఎంతో వెతికినా కనిపించలేదని చెప్పింది. అయితే ఆమె తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో సుదీర్ఘంగా విచారించడంతో నేరం అంగీకరించింది.
తన భర్త తనను చిత్ర హింసలకు గురి చేసేవాడని, కుమారులను కూడా కొట్టేవాడని అందుకే పథకం ప్రకారం హత్య చేశానని ఆమె పోలీసులకు వివరాలు వెల్లడించింది. ఆమె నిద్రమాత్రలు కలిపిన మద్యం సీసా, గొంతు నులిమి చంపేందుకు ఉపయోగించిన వస్తువులు, నేరం చేసినప్పుడు ఆమె ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.