
కర్ణాటక ఒక సహజ కాంగ్రెస్ రాష్ట్రం అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లకు పైగా మెజారిటీతో అధికారంలోకి వచ్చేలా చూడాలని పార్టీ కార్యకర్తలకు ఆయన కోరారు. శుక్రవారం ఆయన కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘చట్టవిరుద్ధమైన’ శక్తిగా నిందించిన రాహుల్ గాంధీ.. కర్ణాటకలో బీజేపీ నాయకత్వం ‘ఆర్థిక వనరుల’తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. ఈ 40 శాతం కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి పరిపాలన అందిస్తోందని ఆయన ఆరోపించారు.
బీజేపీ నేటి భారతదేశ యువతకు ఉపాధి కల్పించలేకపోయిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకకు వచ్చి అవినీతిపై పోరాడాలని మాట్లాడితే రాష్ట్రమంతా నవ్వుకుంటోందని అన్నారు. ఇది 40 శాతం ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తి ఉంటుంది. ఇది కాంగ్రెస్ సహజ స్థితి. 150 సీట్లకు తగ్గకుండా వస్తాయని, కర్ణాటకను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామని మనస్సులో ప్రతీ ఒక్క కార్యకర్త స్పష్టంగా చెప్పుకోవాలని రాహుల్ గాంధీ తెలిపారు.
పార్టీ కోసం చేసిన విధేయంగా పని చేసిన వారికి ఎన్నికల టిక్కెట్లు ఉండాలని కాంగ్రెస్ అధినేత నొక్కి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. “ కర్ణాటకలో అసలు పని ఎవరు చేస్తున్నారో కనుక్కోవడం చాలా సులభం. కాంగ్రెస్కు ఆ వ్యక్తి చేస్తున్న పనిని బట్టి మనం టిక్కెట్లు నిర్ణయించాలి. మనం దగ్గరి ఫలితాల కోసం ఎన్నికల్లో పోరాడకూడదు. మనం ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఉండటానికి పోరాడాలి ’’ అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్ల మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ద్రవ్యోల్బణంపై బీజేపీ ప్రభుత్వంపై దాడి చేసిన ఆయన, దేశంలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ పెద్ద సవాలుగా ఉందని అన్నారు. దీనికి కారణం నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాలే అని ఆరోపించారు.
2018 మే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ముఖ్యంగా జేడీ(ఎస్), బీజేపీ, కాంగ్రెస్ ప్రముఖంగా తలపడ్డాయి. అయితే ఫలితాలు మాత్రం ఎవరికీ అనుకూలంగా రాలేదు. ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. దీంతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ముందుకు వచ్చింది. మొదట సీఎంగా ఆయనే ప్రమాణస్వీకారం చేశారు. కానీ అసెంబ్లీలో ఆయన బలం నిరూపించుకోలేపోయారు. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ నాయకుడు కుమార స్వామి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు.
అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో రోజులు సాఫీగా సాగలేదు. దాదాపు 13 నెలల పాటు అధికారం చేపట్టిన తరువాత ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ పరీక్షలో ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. మళ్లీ బీజేపీ నుంచి యడియూరప్ప సీఎం అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ ఆయన రాజీనామా చేశారు. తరువాత బసవరాజ్ బొమ్మై సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 224 సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో 2023 మే నెలలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది.